హైదరాబాద్ : ఏపీలో ఆరుజిల్లాలపైనే కేసీయార్ టార్గెట్ పెట్టారా ?

Vijaya


ఏపీ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్ కు మంత్రి కేటీయారే స్టార్ క్యాంపెయినర్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఏపీ రాజకీయాల్లో పట్టుసాధించేందుకు వ్యూహాలు పన్నుతున్న కేసీయార్ తొందరలోనే ఏపీలో ప్రాంతీయ సదస్సులను నిర్వహించాలని అనుకున్నారట. ఈ సదస్సుల్లో వివిధ రంగాల్లో  తెలంగాణా సాధించిన ప్రగతిని ఏపీలోని జనాలకు ముఖ్యంగా యూత్ కు వివరించబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కేటీయార్ కు స్టార్ క్యాంపెయినర్ హోదాను ఇచ్చి తనతోనే పర్యటనలు చేయించాలని డిసైడ్ అయ్యారట.



ఇప్పటికే కూతురు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ గొంతును వివిధ రాష్ట్రాల్లో వినిపిస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్రాల్లో రెండుసార్లు కవిత పర్యటించి సమావేశాలు నిర్వహించారు. తొందరలోనే ఏపీలో పర్యటించేందుకు రెడీ అవుతున్నరాట. కేటీయార్ తొందరలోనే తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. పై ఆరు జిల్లాల్లో తనకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని కూడా కేసీయార్ అంచనా వేస్తున్నారట. బీఆర్ఎస్ కున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఏపీలోని చాలా ప్రాంతాల్లోని యువత హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తుండటం లేదా ఏదో కోర్సు చేస్తుండటమే.



ఇలాంటి యువతను బీఆర్ఎస్ కు అప్రకటిత బ్రాండ్ అంబాసిడర్లుగా ఉపయోగించుకునే ఆలోచన కూడా చేస్తున్నారట. హైదరాబాద్ లో ఉద్యోగాలకు, ఉన్నత కోర్సులు చేయటానికి ఉన్న అవకాశాలను యువత ఎలాగూ తమ ప్రాంతాల్లో చెబుతునే ఉంటారు. కాబట్టి అలాంటి యువతను గుర్తించి వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రచారం చేయించుకునే వ్యూహం బాగా వర్కవుటవుతుందని కేసీయార్ భావించారట.



ఇక పనిలోపనిగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లను గెలుచుకోవటమే టార్గెట్ గా పెట్టుకున్నారట. అందుకనే నియోజకవర్గాల వారీగా సామాజికవర్గాల జనాభాను, అందులో బలమైన నేతలను గుర్తించే పనిని కేసీయార్ కొందరు నేతలకు ఇప్పటికే అప్పగించారట. వివిధ కులసంఘాల్లో పట్టున్న నేతలతో పాటు ఇతర పార్టీల్లోని బలమైన నేతలను, టికెట్ల దక్కవని అనుమానం ఉన్న సిట్టింగులు లేదా సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. ఈ బాధ్యత ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు అప్పగించారని సమాచారం. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: