అమరావతి : పవన్ హిడెన్ అజెండా ఇదేనా ?

Vijaya




రోడ్డుషోలు, యాత్రలు, సభల పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వంతో ఘర్షణకు రెడీ అవుతున్నారా ? వ్యవహారం చూస్తుంటే అలాంటి అనుమానాలే పెరిగిపోతున్నాయి. ఈనెల 24వ తేదీన కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. ఎన్నికల యాత్రల కోసం ప్రత్యేకంగా తయారుచేయించుకున్న వారాహి వెహికల్ ను దేవాలయాలకు తీసుకెళ్ళి పవన్ పూజలు చేయించబోతున్నారు.



పూజల కోసం వారాహిని రెడీచేస్తున్న పవన్ తర్వాత ఏమి చేయబోతున్నారనే విషయంలో మాత్రం క్లారిటిలేదు. పూజలు చేయించిన వెంటనే యాత్రకు శ్రీకారం చుడతారా ? లేకపోతే పూజలు అయినవెంటనే మళ్ళీ వెహికల్ ను తీసుకెళ్ళి షెడ్డులో పెట్టేస్తారా అనేది సస్పెన్సుగా మారింది. అయితే పార్టీవర్గాల సమాచారం ప్రాకారం ఒక మంచి ముహూర్తం చూసుకుని వారాహితో ఏపీలో యాత్రలకు పవన్ రెడీ అవుతున్నారట.



తన యాత్రలో రోడ్డుషోలు, రోడ్డుమీదే సభలు నిర్వహించాలని పవన్ డిసైడ్ అయినట్లు సమాచారం. అంటే ప్రభుత్వం ఏదైతే వద్దని ఉత్తర్వులు ఇచ్చిందో దాన్నే పవన్ ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్లు అర్ధమవుతోంది. పవన్ ఆలోచనలను చూసిన తర్వాత ప్రభుత్వంతో ఘర్షణకు రెడీ అవుతున్నట్లే అనుమానంగా ఉంది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించటం ద్వారా గొడవలవుతాయని పవన్ కు బాగా తెలుసు. నిజానికి పవన్ కు కావాల్సింది కూడా అదే. తన రోడ్డుషోలను ప్రభుత్వం అడ్డుకోవాలని, దానివల్ల గొడవలవ్వాలనే పవన్ కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలను ప్రభుత్వం అణిచివేస్తోందనే కలరింగ్ ఇవ్వటమే వీళ్ళకు కావాల్సింది.



మూడు రోజుల కుప్పం పర్యటనలో చంద్రబాబునాయుడు చేసింది కూడా ఇదే. నిజానికి ప్రభుత్వం రోడ్డుషోలు, ర్యాలీలు వద్దని చెప్పలేదు. రోడ్డుషో పేరుతో ఎక్కడంటే అక్కడ రోడ్లపైన సభలు పెట్టవద్దని మాత్రమే చెప్పింది. కానీ చంద్రబాబు, పవన్ మాత్రం ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంతో ఘర్షణ ద్వారా వీళ్ళిద్దరు ప్రజల సానుభూతి, మద్దతును  కోరుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబుది మొదటి రౌండు అయిపోయింది కాబట్టి ఇపుడు పవన్ రెడీ అవుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: