అమరావతి : తాజా ఎపిసోడ్లో టీడీపీ ప్లేసేంటి ?

Vijaya






తాజా ఎపిసోడ్లో తెలుగుదేశంపార్టీ ప్లేసేంటో తెలీక తమ్ముళ్ళు తెగ గింజుకుంటున్నట్లున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే మూడురాజధానులు, అధికార వికేంద్రీకరణకి మద్దతుగా ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన భారీ బహిరంగసభ జరగబోతోంది. దీనికి అధికార వైసీపీ మద్దతుంటుంది కాబట్టి ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. బహిరంగసభకు మద్దతుగా మంత్రులు రెగ్యులర్ గా అప్ డేట్లిస్తునే ఉన్నారు.



ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఎందుకీ గర్జనలని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో 25 రాష్ట్రాలు చేసేస్తే సరిపోతుందికదానే సెటైర్లతో మంత్రులను బాగా రెచ్చగొడుతున్నారు. దాంతో మంత్రులు కూడా పవన్ ఒకటంటే తాము పదంటామన్నట్లుగా రెచ్చిపోతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకవైపు మంత్రులు, ప్రభుత్వం వాయిస్ మరోవైపు పవన్ వాదన మాత్రమే వినిపిస్తోంది.



మరి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వాయిస్ ఎందుకు వినిపించటంలేదు ? ఎంతసేపు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు వైసీపీవి దొంగనాటకాలని పదే పదే దెప్పి పొడవటం తప్ప వైజాగ్ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వద్దని ఎందుకు బలంగా డైరెక్టుగా చెప్పలేకపోతున్నారు ? అమరావతే ఏకైక రాజధానిగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో కొందరు పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ళు మాత్రమే అమరావతి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. చంద్రబాబునాయుడు అండ్ కో మాత్రం మూడు రాజధానులు ఎందుకు అని మాత్రమే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.



అమరావతి జేఏసీలో వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా వైజాగ్ కు వ్యతిరేకంగా ఎందుకని  చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళు మాట్లాడలేకపోతున్నట్లు ? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ను వ్యతిరేకిస్తే వచ్చే ఎన్నికల్లో తాము గెలవటం కష్టమనే భయం ఏమన్నా మొదలైందా ? పార్టీలో ఏమి జరుగుతోందో స్పష్టంగా తెలీదుకానీ ఇపుడు జరుగుతున్న ఎపిసోడ్లో మాత్రం టీడీపీ ప్లేసు ఏమిటో అర్ధంకాక తమ్ముళ్ళ గింజుకుపోతున్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే రాజధాని వివాదంలో వైసీపీ, జనసేన మాత్రమే హైలైట్ అవుతున్నాయి కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: