ఏపీలో మరో రెండు భారీ వర్షాలు..ఆ జిల్లాలకు అలర్ట్..

Satvika
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ లోని కోస్తా, రాయలసీమలోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో గత రెండు రోజులుగా కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. అదే విధంగా.. తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలతో పాటు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని పలుచోట్ల బుధవారం వర్షాలు కురిశాయి. ఈనెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు మధ్య మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయి.

ఈ ప్రభావంతో అక్టోబర్ 5వ తేదీ ( బుధవారం ) కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అక్టోబర్ 6వ తేదీ ( గురువారం ) కూడా ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రాలోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పండగల సందర్భంగా యువత, మహిళలు సముద్ర స్నానాలకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బుధ, గురు వారాల్లో తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని హెచ్చరించారు. విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ వాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా అప్రమత్తం అవుతున్నారు. ప్రజలు ప్రతి నిమిషం అప్రమత్తం వుండాలని సూచించారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: