"మునుగోడు" లో గెలిచేది బీజేపీ... కేసీఆర్ పై శివమెత్తిన రాములమ్మ !

VAMSI
నిన్న తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ నాయకుడు మరియు భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈయన రాకకు కారణం గత వారం రోజుల నుండి మీడియా మిత్రులు హోరెత్తిస్తున్నారు. తెలంగాణ లో మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి సొంత పార్టీ కాంగ్రెస్ లో పొసగక బీజేపీలోకి వెళ్లేందుకు నిశ్చయించుకుని... గత వారమే రాజీనామా చేశారు. అయితే ఆయనను స్వయంగా అమిత్ షా పార్టీలోకి ఆహ్వానించడానికి ఢిల్లీ నుండి వచ్చారు. అంతే కాకుండా రాజ గోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే, పనిలో పనిగా ఈ ఎన్నిక ప్రచారానికి కూడా ఉపయోగపడుతుందని భావించారు.
కాగా నిన్న జరిగిన మునుగోడు బీజేపీ మహా సభలో బీజేపీ నాయకురాలు విజయశాంతికి మాట్లాడే అవకాశం లభించింది. చాలా కాలం తరువాత పార్టీ తరపున మాట్లాడే అవకాశం వచ్చినందున అధికార తెరాస పై మరియు తెలంగాణ సీఎంపై ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ, కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు కావస్తోంది. అయితే ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన హామీలను పూర్తి స్థాయిలో అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం సమిష్టిగా విఫలం అయిందని దుయ్యబట్టారు. అందులో భాగంగా చూసుకుంటే డబల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుపేదలకు ఇవ్వాల్సిన భూమి లాంటివి ఇంకా చాలా ఉన్నాయని విజయశాంతి చెప్పుకొచ్చారు.
ఇంతకాలం ప్రజలకు అబద్దాలు చెబుతూ నెట్టుకొస్తున్నారని... అందుకే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని  మరియు ఇప్పుడు జరగబోయే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని ఈమె ప్రజలకు పిలుపునిచ్చారు.  ఇలా మునుగోడు ఉప ఎన్నిక లో ఎవరు గెలుస్తారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: