చీకట్లో రాష్ట్రం... విద్యుత్ అవసరాలు పెరగడమే కారణమా ?

VAMSI
తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం వరుస కరెంట్ కోతలతో జనం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాలలో అర్ధరాత్రుల్లు సైతం కరెంట్ గంటల కొద్దీ కట్ చేస్తుండటంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బుధ, గురువారాలు సైతం రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఉక్కపోతతో మగ్గిపోయారు. ఈ కారణంగా చాలా ప్రాంతాలు కరెంట్ లేక అంధకారంలో మునిగిపోయాయి. ఒకవైపు అదనంగా ఎంత విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నా రాష్ట్రాలలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం కారణంగా కొరత కొనసాగుతూనే ఉంది. అసలే వేసవికాలం అందులోనూ ఎండలు మండిపోతుండటంతో ఈసారి విద్యుత్ వినియోగం ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అదనపు లోడ్‌ సర్దుబాటులో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.
వీటి కారణంగానే రెండు అర్జుల నుండి విద్యుత్ సరఫరా సరిగా లేదు. దాంతో ప్రజలు ఇళ్ళల్లో దీపాలు పెట్టుకుని నిద్రపోకుండా కూర్చున్నారు. రాష్ట్రం లో బుధవారం 198.21 మిలియన్ యూనిట్లు డిమాండ్ ఉండగా.... డిమాండ్ ఉన్న మేరకు అనుగుణంగా సరఫరా చేయలేక అత్యవసర లోడ్ సర్దుబాటు పేరిట 5.68 మిలియన్ యూనిట్ల మేర కోత విధించాల్సి వచ్చింది అని అధికారులు చెబుతున్నారు. దీని కారణంగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో అంధకారం నెలకొంది. మున్సిపాలిటీల్లో అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల తర్వాత సరఫరా పునరుద్ధరించినా.. గ్రామాల్లో గురువారం తెల్లవారుజాము వరకూ సరఫరా చేయలేదు. అంచనాల మేరకు పవన విద్యుత్ రాకపోవడం, థర్మల్ యూనిట్లలో సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తి తగ్గడంతో అత్యవసర లోడ్‌ సర్దుబాటుకు కోతలు విధించాల్సి వచ్చిందని అధికారుల చెప్పారు.
గురువారం రాత్రి కూడా పలు పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 190 నుంచి 200 మిలియన్ యూనిట్ల మధ్య ఉండే అవకాశం ఉందనేది అధికారుల అంచనా. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరుల ద్వారా వచ్చే విద్యుత్ సరిపోతుందని భావించారు. ఈ మేరకు పరిశ్రమలకు విధించిన విద్యుత్ విరామాన్ని దశల వారీగా తొలగించారు. బుధవారం డిమాండ్‌ 198.21 మిలియన్ యూనిట్లు ఉన్నా.. దీనికి అనుగుణంగా సరఫరా చేయడం డిస్కంలకు సాధ్య పడలేదు. థర్మల్ విద్యుత్‌ 84.36 మిలియన్‌ యూనిట్లు, జల విద్యుత్‌ 6.49, పవన విద్యుత్ 22.93, సౌర విద్యుత్ 14.08, ఇతర వనరుల నుంచి.. 5.73, కేంద్ర ఉత్పత్తి సంస్థ నుంచి 48.62 మిలియన్‌ యూనిట్లు గ్రిడ్‌కు అందాయి. ఎక్స్‌చేంజీల నుంచి 6.73 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను డిస్కంలు కొన్నాయి.
జాతీయ గ్రిడ్‌ నుంచి అన్‌ షెడ్యూల్డ్‌ ఇంటర్ ఛేంజ్‌ కింద 3.59 మిలియన్ యూనిట్లు అదనంగా తీసుకున్నా ఇంకా 5.68 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది. కర్ణాటకలోని కూడ్గి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి కొనుగోలు ఒప్పందాల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 240 మెగావాట్లలో కేవలం 80 మెగావాట్లే వస్తోంది. కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం ఉత్పత్తి నిలిచిపోయింది. మరో యూనిట్ నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి రావడం లేదు. మంగళవారం సగటున 321, బుధవారం 316 మెగావాట్లే వచ్చింది. పవన విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు నిలిచిపోతుందో అంచనా వేయడం కష్టంగా ఉందని అధికారులు అంటున్నారు. కోతలకు పవన విద్యుత్తే కారణమని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: