కొండేక్కిన మిర్చి..మార్కెట్ లో ధరలు భగ భగ..
ప్రస్తుతం మార్కెట్లో కిలో పచ్చిమిర్చి వంద పైనే పలుకుతోంది. విషయాన్నికొస్తే.. ఉమ్మడి కరీంనగర్జిల్లాలో పచ్చి మిర్చి ధరలు గుండెల్లో మంటను కలిగిస్తున్నాయి నిత్యావసర వస్తువుగా మారిన పచ్చి మిర్చి కొన్ని వాతావరణంతో ఈ ఏడాది సరైన దిగుబడి ఇవ్వలేదు. ఈ మేరకు ఇతర ప్రాంతాల నుంచి మిర్చి దిగుమతి చేసుకుంటున్నారు. కిలో పచ్చి మిర్చి ధర వంద దాటేసింది. మార్కెట్లలో మిర్చి లభించడం లేదు. దొరికిన కొన్ని మార్కెట్లలో నాణ్యత ఉండటం లేదు. పంట చేతికొచ్చే అవకాశం లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.. దీంతొ మిర్చి కొనేవారి సంఖ్య పైకి కదిలింది.
భారీగా పెరిగిన పచ్చి మిర్చి ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనడమే భారంగా మారింది. హోటళ్లలో మిర్చి వినియోగాన్ని తగ్గించేశారు. మిర్చి బజ్జీల రేట్లను కూడా పెంచడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా మే, జూన్ నెలలో పచ్చిమిర్చి రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే సంక్రాంతి తర్వాత మిర్చి ధర పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎండలు పెరగడంతో మిర్చి తోటలు కూడా చేతికి రావడం కష్టమే అంటున్నారు. రేట్లు మరింత పెరిగితే పరిస్థితేంటని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇక మార్కెట్లో మిర్చి తక్కువగా రావడంతో దళారులు కూడా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేస్తున్నారు. దాంతో సామాన్యులు పచ్చిమిర్చి వైపు వెళ్ళడం మానేశారు. ఇటీవల చికెన్ ధరలు కూడా భారీగా పెరిగాయి.