అమరావతి : జగన్ కు పెద్ద తలనొప్పి వచ్చిందే ?
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం రూపంలో జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పే వచ్చింది. దివంగత మంత్రి ఏకంగా ఐదు శాఖలను నిర్వహించేవారు. అందులో పరిశ్రమలు, ఐటి శాఖలు చాలా కీలకమైనవి. పరిశ్రమలు, ఐటి శాఖ కంపెనీల వల్ల రాష్ట్రం చాలా రకాలుగా అభివృద్ధి చెందుతుందన్న విషయం తెలిసిందే. గౌతమ్ ఆ శాఖలను సమర్ధవంతంగానే నిర్వహించారు. రెండున్నరేళ్ళుగా బాగా శ్రమతీసుకుని చాలా కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు.
ఆయన చనిపోయిన తర్వాత ఇంగ్లీషు మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం రు. 2.16 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలను తెచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మంత్రెప్పుడు తాను ఇన్ని కోట్ల రూపాయల పరిశ్రమలను తెచ్చానని చెప్పుకోలేదు. జగన్మోహన్ రెడ్డి తనకిచ్చిన బాధ్యతలను ప్రశాంతంగా, చాపకిందనీరులా చేసుకోవటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. జగన్ వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయన్నా, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా మంత్రి పట్టించుకోలేదు.
మంత్రివర్గంలో అందరికీ ఇష్టుడు, మంచి పనితనం చూపించిన గౌతమ ప్లేసులో ఎవరిని నియమించాలన్నదే జగన్ కు పెద్ద తలనొప్పయిపోయింది. గౌతమ్ లాగ పనిచేయగలిగిన వాళ్ళు, ఇంగ్లీషును ధారాళంగా మాట్లాడగలిగి, విషయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరున్నారన్నదే ప్రధాన సమస్యగా మారింది. గౌతమ్ కు రీప్లేస్ మెంట్ అంటే ఫైనాన్స్ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ఒక్కరే కనబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుగ్గన కూడా తన పనేదో తాను చేసుకుపోతుంటారంతే.
బుగ్గన కూడా బాగా చదువుకుని ఇంగ్లీషు మీద మంచి పట్టుండటమే కాకుండా విషయం పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. కాబట్టి గౌతమ్ చూసిన శాఖలను బుగ్గనకు ఇచ్చే అవకాశాలున్నాయట. మరి మంత్రివర్గ ప్రక్షాళనవరకు వెయిట్ చేయాలంటే ఎంఎల్ఏల్లో అంతటి గట్టి వ్యక్తి ఎవరున్నారో చూడాల్సిందే. ఎందుకంటే ఎక్కువ రోజులు ఈ శాఖలను జగన్ తన దగ్గరే అట్టిపెట్టుకోలేరు. ఈ శాఖలకు ప్రత్యేకించి మంత్రి ఉండాల్సిందే. మొత్తానికి గౌతమ్ వెళ్ళిపోవటం జగన్ కు పెద్ద తలనొప్పులనే తెచ్చింది.