కొత్త జిల్లాలు : అన్నంటే ఏమనుకున్నార్రా? సీమకు సముద్రమొచ్చింది!
ఇంతవరకూ ఓ లెక్క ఇప్పటి నుంచి ఓ లెక్క అని ఓ డైలాగ్ ఉంది కదా! అదేవిధంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటున్నారు.ఆయన లెక్క ప్రకారం సీమ జిల్లాలకు ఒక సముద్రం కూడా తెచ్చేశారు.ఇప్పటిదాకా సముద్రం లేనే లేదు కానీ ఇకపై అయితే సీమ జిల్లాలకు సముద్రం రాక ఖాయం అయిపోయింది.అంటే మన పాలకులు ఏమనుకుంటే అది అయిపోతుంది అని అనేందుకు ఇంతకు మించిన మరో మంచి ఉదాహరణ లేదనే అనుకోవాలి.ఆ లెక్కన సీమకు ఉప్పునీటి గాలులు పరిచయం కానున్నాయి. అంటే సీమ జిల్లాలకు సముద్రుడి దోస్తీ ఇకపై కుదరనుంది. బాలాజీ జిల్లా పేరిట తిరుపతి లోక్ సభ నియోజకవర్గాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు కదా! ఆ జిల్లా కేంద్రం తిరుపతిగా ఉండనుంది.అయితే ఇదే జిల్లాలో నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గాన్ని తీసుకువచ్చి విలీనం చేశారు.దీంతో సీమ జిల్లాకు సముద్ర తీరం వచ్చేసింది.
ఇక సీమ జిల్లాలు నాలుగు నిన్నటి వరకూ
కాగా ఇప్పుడు ఎనిమిది అయ్యాయి.
అనంతపురం, శ్రీ సత్యసాయి
చిత్తూరు, బాలాజీ
కడప,అన్నమయ్య
కర్నూలు, నంధ్యాల జిల్లాలు ఏర్పాటు అయ్యాయి.
వీటిలో కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటుపై వివాదాలు రేగుతున్నాయి. ఇవి మినహా మిగతా ప్రాంతాలలో పెద్దగా వివాదాలేవీ లేవు. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మాత్రం డిమాండ్లు రేగుతూనే ఉన్నాయి.ఇక కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత సిబ్బంది పంపకం, కొత్త కార్యాలయాల ఏర్పాటు వంటివి పెద్ద తలనొప్పిగానే మారబోతున్నాయి. సీమకు మాత్రం అనేక ప్రతిపాదనలు ఉన్నాయి కానీ అవేవీ ఒడ్డెక్కించేలా లేరు సీఎం జగన్. ప్రస్తుతానికి నా మాటే శాసనం అన్న విధంగానే ఆయన ఆలోచనలు సాగుతున్నాయి.అయితే జిల్లాల ఏర్పాటు రాజకీయంగా ఉనికిని దెబ్బతీస్తాయా అన్న ప్రశ్న ఒకటి తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నా జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆ సందేహాలను సైతం కొట్టి పారేస్తున్నారు.