టెస్లా వ్యాపారం.. పార్టీల రాజకీయం
రెండు రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ టెస్లా వస్తే తెలంగాణ రాష్ట్రం ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడో ఐదారేళ్ల క్రితం యూఎస్లో తాను టెస్లా కార్ ను నడిపిన ఫోటోలను కూడా ఈ సందర్భంగా షేర్ చేశారు కూడా. తమ ప్రభుత్వం ఈవీల తయారీ కంపెనీలను ప్రోత్సహిస్తోందని ఇప్పటికే తెలంగాణలో ట్రిటాన్ రూ. 2,100 కోట్లతో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోందని కూడా కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఈ పోటీలోకి పంజాబ్ ప్రభుత్వం కూడా దిగింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ టెస్లా కంపెనీని పంజాబ్లోని లూథియానాలో పెట్టాలంటూ ఆహ్వానించారు. పంజాబ్ను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు తాము ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన తెలిపారు. మరోపక్క బెంగాల్ కూడా ఈ రేసులో తామూ ఉన్నామని చాటుకోవడం మరో విశేషం. ఆ రాష్ట్ర మంత్రి మహమ్మద్ గులామ్ రబ్బానీ మస్క్ తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే అన్నిరకాలుగానూ సహకరిస్తామని పేర్కొన్నారు. ఒకప్పుడు టాటా కార్ల కంపెనీకి వ్యతిరేకంగా మమత చేసిన పోరాటం గుర్తుకు తెచ్చుకుంటే ఇది ఆశ్చర్యమే మరి. మరోపక్క మహారాష్ట్ర ప్రభుత్వం కూడా టెస్లా కు రెడ్ కార్పెట్ పరచేందుకు సిద్దంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ రాష్ట్రాలన్నీ బీజేపీ వ్యతిరేక పక్షాలే అధికారంలో ఉండటం చూస్తే మస్క్ ఒక్క ట్వీట్తో రాజకీయంగానూ వేడి పుట్టించారనే చెప్పాలి మరి. విదేశీ పెట్టుబడులకు అనుమతించాల్సింది కేంద్రమే. ఈ రాష్ట్రాలు ఇస్తామంటున్న ప్రోత్సాహకాలు నచ్చి మస్క్ ఇండియాకు వస్తారా.. కేంద్రం సానుకూలంగానే ఉంటుందా అనే అంశాలు చూడాల్సి ఉంది.