పందెం కోళ్లకు శిక్షణ ఎలా ఇస్తున్నారో తెలుసా..?
కోడిపందెల్లో ప్రావీణ్యం ఉన్నవారు కుక్కట శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇక పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి కోడి రంగు జాతిని ఎంపిక చేస్తారు. ఏ రంగుతో ఉన్న పుంజును పందెంలోకి దించాలో ఆ రంగు ఉన్న పుంజును మాత్రమే పందెంలోకి దించుతారు అని శిక్షకులు పేర్కొంటున్నారు. కోడిపుంజుకు బలం కోసం బాదం, పిస్తా, డ్రైప్రూట్, లడ్డు, మన్కైమా, కోడిగుడ్లు పెడుతున్నారు. ఆహారంగా సోళ్లు, గంట్లు, మెరికలు అందిస్తున్నారు. పుంజులపై భారీగా పెట్టుబడులు పెట్టి సంక్రాంతి పండుగ రాబట్టుకోవాలని కొందరూ శ్రమిస్తున్నారు.
ఒక్కో శిబిరంలో 20 నుండి 200 వరకు పుంజులను పెంచుతారు. స్థాయిని బట్టి పుంజులను పెంపకం కోసం ఏడాదికి 6లక్షల నుండి కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో సంక్రాంతి కోడి పందాలకు సిద్ధమవుతున్నారు. పందెం కోళ్లను ప్రతీరోజు ముగ్గురు సంరక్షించుకుంటారు. మిలటరీ స్థాయిలో శిక్షణ ఇస్తారంటే పందాలపై ఏ మేరకు శ్రద్ధ చూపుతారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఉదయం 5 గంటల నుంచే కోడి పుంజులను బయటకు తీసి కాసేపు చల్లని గాలికి శ్వాస తీసుకునేందుకు ఏర్పాటు చేసారు. ఆ తరువాత కోడి పుంజులను పరుగెత్తిస్తారు. ఆ తరువాత స్విమ్మింగ్ చేయిస్తారు. పుంజుకు రూ.100 నుంచి రూ.400 వరకు ఖర్చు చేస్తారని పందెం కోళ్లకు శిక్షణ ఇచ్చే వారు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా పందెంలలో గౌడ నెమలి, తెల్ల నెమలి, కోడినెమలి, కాకిడేగ, కక్కెర, నల్లకక్కెర, రసంగి, కుక్కురాయి, ఎర్రడేగ వంటి జాతులుంటాయి. కోడి పందెంలలో నెగ్గేందుకు ముహుర్తాలు చూస్తుంటారు. ఏకోడి రోజు పందెంలో పాల్గొంటే విజయం సాధిస్తుందో ఆ కోడిని పందెంలోకి దింపుతారని సమాచారం. బోగి పండుగ రోజు గౌడ నెమలికి, సంక్రాంతి రోజు కాకి నెమలి, పసి మగల్ల కాకి, కాకిడేగలకు, కనుమ రోజు డేగలు, ఎర్రకాకిడేగలు, పందెంలో విజయం సాధిస్తాయని వారి నమ్మకం.