ఈ ఏడాదిలో జరగబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై దేశం మొత్తం ఫోకస్ పెట్టింది. దీంతో ఈసారి కూడా యూపీలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ పట్టుదలతో ఉంది. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రాలుగా రామమందిరం, మధురలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం, కాశీ విశ్వనాథ ఆలయ పనులు మార్చుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తోంది. మధుర, బృందావనంలో ఆలయ నిర్మాణాలే తమ ఎజెండా అని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రచారం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆలయాల చుట్టే యూపీ రాజకీయాలు తిరుగుతున్నాయి.
అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలయిన నేపథ్యంలో మథురలో శ్రీకృష్ణ ఆలయం నిర్మించాలని హిందూ సంస్థలతో పాటు బీజేపీ నాయకులు కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో యూపీ ఉప ముఖ్యమంత్రి అయోధ్య, కాశీ విశ్వనాథ్ ఆలయాల తరువాత తమ పని మథురలో శ్రీకృష్ణ ఆలయం నిర్మించడమేనని ప్రకటించడంతో రాజకీయ వేడి కొనసాగుతోంది. తాజాగా యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఎన్నికల సీజన్ మొదలయినప్పటి నుంచి ఇప్పుడు యోగి ఆధిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అమృహలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యోగి మాట్లాడుతూ.. అయోధ్య, కాశీ విశ్వనాథ్ ఆలయాల మాదిలాగే మధుర, బృందావనం దేవాలయాలు నిర్మిస్తాం.. దానికి సంబంధించిన పనులు మొదలవుతాయిన పేర్కొన్నారు.
దీంతో బీజేపీ తరువాతి ఎజెండా మధుర అని స్పష్టంగా కనిపిస్తోంది. యోగి మాటలపై రాజకీయ దుమారం సంతరించుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం లు స్పందిస్తూ.. బీజేపీ మళ్లీ మతపరమైన అంశాలను తీసుకువస్తుందని పెట్రోల్, డీజిల్ లాంటి ప్రజా సమస్యలపై మాట్లాడాలని విమర్శించాయి. అయితే, యూపీలో ఉన్న 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో పశ్చిమ యూపీలో 76 స్థానాలు ఉన్నాయి.. దీంట్లోనే మధుర ఉండడంతో బీజేపీ ఫోకస్ చేసింది. యోగిని మధుర నుంచి పోటీ చేయాలని డిమాండ్లు తీసుకురావడం ద్వారా మరింత ఆసక్తి పెంచారు. అయితే, ఆలయాల అంశాలను ముందు పెట్టి ఎన్నికల్లో లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.