మైలవరం.. 24 సమరానికి వ్యూహ రచన...!
ఇక అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రతిపక్ష టిడిపి పావులు కదుపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి మూట కట్టుకున్న తెలుగు తమ్ముళ్లు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి తన ఉనికిని చాటుకుంది.. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు ఇచ్చిన బూస్టింగ్ తో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటేందుకు తెలుగు తమ్ముళ్లు పక్కా వ్యూహ రచన సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికార వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టాలనే వ్యూహంతో కొండపల్లి మున్సిపాలిటీ కేంద్రంగా ఒక పెద్ద కార్యాలయం ఏర్పాటు చేయాలని టిడిపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో చక్రం తిప్పిన ఇద్దరు ప్రముఖ పేరున్న నేతలు రంగంలోకి దిగుతున్నట్లు మున్సిపాలిటీ వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. కొండపల్లి మున్సిపాలిటీ పాలక వర్గ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిడిపి ఎంపి కేశినేని నాని సూచనలు మేరకు ఆ ఇద్దరు నేతలు మైలవరం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జరుగుతున్న ప్రచారం లో వాస్తవం ఎంత, అసలు 2024 ఎన్నికల్లో ఇరు పార్టీల నేతల వ్యూహాలు ఎంత మేర పనిచేస్తాయో వేచి చూడాలి.