కేసీఆర్ కొత్త టీమ్ రెడీ... వాళ్లు మళ్లీ ఛాన్స్ కొట్టేశారు...!
ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కేసీఆర్ సార్. తెలంగాణలో ఇటు రాజకీయంగా.. అటు పాలనా పరంగా కూడా కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఖాయమనే ప్రచారం ప్రస్తుతం పార్టీలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీల నియామకం కూడా పూర్తి కావడంతో... ఇక నామినేటెడ్ పదవుల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణ పైనే ప్రస్తుతం కేసీఆర్ దృష్టి పెట్టారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనుండగా... బీసీ, ఎస్సీ వర్గాలను ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. మండలిలో 40 స్థానాలకు గాను.. ఇప్పటికే టీఆర్ఎస్ బలం 36కు చేరుకుంది. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా కలిపి పూర్తి గులాబీ రంగులో మండలి మారిపోయింది. ఇప్పటికే మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్, విప్ పదవులు కూడా ఖాళీ అవుతున్నాయి. దీంతో వీటి భర్తీపై కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. కేబినెట్లో ఛాన్స్ కోసం కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి కేసీఆర్ చల్లని చూపు ఎవరిపై ఉంటుందో చూడాలి మరి.