జలవివాదాలను సరైన సమయంలో సరైన విధంగా పరిష్కరించాలని చాలా తపన పడుతున్నాడు వైఎస్ జగన్. అవును ఆ తపనలోనో తాపత్రయంలోనో భాగంగానే ఇవాళ ఒడిశాకు వెళ్తున్నాడు. మా జిల్లా అంటే శ్రీకాకుళం జిల్లా సమస్యలు, సరిహద్దు సమస్యలు అన్నీ కూడా ఒడిశాతోనే ముడిపడి ఉన్నాయి. కనుక వాటిపై మాట్లాడేందుకు ఇవాళ నవీన్ పట్నాయక్ తో భువనేశ్వర్ కేంద్రంగా భేటీ అవుతున్నాడు. వాస్తవానికి ఈ సమస్య పై ఏప్రిల్ లో లేఖ రాశాడు జగన్. వంశధార ప్రాజెక్టుకు అనుసంధానంగా నేరడి బ్యారేజీ రూపకల్పనకు ఎప్పుడో ప్రతిపాదనలు ఉన్నా, సంబంధిత భూ సేకరణ అన్నది ఓ ఆటంకంగా ఉంది. దీనిపై ఒడిశా అభ్యంతరాలు తెలుపుతూ తాము బ్యారేజీ నిర్మాణానికి సేకరించాల్సిన 103 ఎకరాలనూ ఇందాక అప్పగించలేదు. దీంతో బ్యారేజీ నిర్మాణం ఇప్పటిదాకా మొదలు కానే కాలేదు.
వంశధార ఫేజ్ 2 ద్వారా అనుకున్న లక్షాలు నెరవేరాలంటే బ్యారేజీ నిర్మాణం అన్నది తప్పని సరి! కానీ ఒడిశా మాత్రం తాము ఎక్కువగా నష్టపోతామని చెబుతోంది. దీంతో సుదీర్ఘ కాలంగా ఉన్నఈ సమస్య ఓ కొలిక్కి రావడం లేదు. దీనిపై తనకు అనుమతి ఇస్తే వచ్చి మాట్లాడతానని వైఎస్ జగన్ అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ కు లేఖ రాసినా కూడా అక్కడ జరగాల్సిన పనులు మాత్రం ఏవీ ఆగడం లేదు. ఎందుకంటే ఒడిశా ఎగువన ప్రాజెక్టుల రూపకల్పనకు ప్లాన్ చేస్తుంది. అదే కనుక జరిగితే దిగువ ఉన్న శ్రీకాకుళం జిల్లా నష్టపోవడం గ్యారెంటీ. అంతేకాదు బ్యారేజీ నిర్మాణానికి ఎప్పటి నుంచో ససేమీరా అంటోంది.
తము భూములు ముంపునకు గురవుతాయని కూడా అంటోంది. అయితే ఏపీ సర్కారు మాత్రం బ్యారేజీ నిర్మాణంతో ఒడిశా పరిధిలో ఎనిమిది వేల ఎకరాలకు నీళ్లు అందుతాయని చెబుతోంది. అంతేకాదు బ్యారేజీ పూర్తయితే అక్కడ నిల్వ చేసిన నీటి (19.05 టీఎంసీలు) ఆధారంగా ముందుగా నిర్ణయించుకున్న లక్ష ఎకరాలకు నీరు వంశధార ఫేజ్ 2 ద్వారా అందించవచ్చని కూడా అంటోంది. బ్యారేజీ నిర్మాణం పూర్తయితే కానీ వంశధార రిజర్వాయర్ ద్వారా నీరు అనుకున్న విధంగా సాగుకు అందించలేమని నిపుణులు చెబుతున్నారు. ఎగువన ఉన్న నీరు దిగువకు చేరే క్రమంలో సైడ్ వియర్ నిర్మాణం చేపట్టినా దీని ద్వారా కొంత మేరకే ఫలితం. ఈ నిర్మాణంను వినియోగించుకుని 8 టీఎంసీల నీటినే మళ్లించవచ్చు. అదే బ్యారేజీ నిర్మాణం పూర్తయితే అనుకున్న విధంగా రిజర్వాయర్ నీటి ని నిల్వ చేయవచ్చు. సాగుకు అందించనూ వచ్చు. అయితే దీనిపై ఒడిశా మాత్రం అస్సలు సుముఖంగా లేదు. ఒడిశా భూ సేకరణ చేస్తే తాము పరిహారం ఇస్తామని ఏపీ సర్కార్ చెప్పినా కూడా వినేలా లేదు. ఈ దశలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏపీ సీఎం జగన్ తో ఏం చెబుతారో అన్నదే కీలకం.