జగన్ కోతలు : సంక్షేమమే సంక్షోభానికి అసలు కారణం
ఒకప్పుడు మిగులు విద్యుత్తుతో ఉన్న రాష్ట్రం. ఇప్పుడు చీకట్లు తప్పవు అని భయపడిపోతున్న రాష్ట్రం. పొరుగు రాష్ట్రం కన్నా ఎందులోనూ తీసిపోని రీతిలో ఆర్థిక వనరులు ఉన్నా అవన్నీ కరిగించుకుపోతున్నాయి. తరిగిపోతున్నాయి. హరించుకుపోతున్నాయి. ఈ దశలో అవసరానికి మించిన అధికార దాహం కారణంగానే విద్యుత్ వంటి రంగాలను జగన్ పట్టించుకోలేదన్న విమర్శ వస్తోంది. సొమ్ములన్నీ సంక్షేమానికి కేటాయించి, ఇప్పటికిప్పుడు బొగ్గు కొనుగోలు నిధులు తేవాలంటే ఎలా అని? అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.
విద్యుత్ కు సంబంధించి అధికారులు చేసిన పొరపాట్లు కొన్ని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. జెన్ కో కన్నా తక్కువ ధరకే బయట విద్యుత్ లభ్యం అవుతుండడంతోనే తాము సింగరేణి నుంచి మూడు నెలల పాటు ( మార్చి, ఏప్రిల్, మే) బొగ్గు కొనుగోలు చేయకుండా ఉండడంతో యూనిట్లు అన్ని పూర్తిగా మూలకు చేరుకున్నాయి. తరువాత పరిణామాల నేపథ్యంలో విద్యుత్ అవసరత గణనీయంగా పెరిగింది. కోవిడ్ టైంలో విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్నా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన కారణంగా వినియోగం పెరుగుతూ వచ్చింది. ఇంతటి వినియోగానికి సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి రావడం లేదు. దీంతో పాటు సింగరేణి బొగ్గు గనులకు చెల్లించాల్సిన మొత్తాలనూ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు.