మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ రావడం లేదు. ఈ తరుణంలో ఏం చేయాలో తలలు పట్టుకుంటున్నారు ఏపీ అధికారులు. ఇప్పుడు కోతలు తప్పని సరి. త్వరలో నాలుగు నుంచి ఆరు గంటల కోతలకు ప్రజలు సిద్ధం కావాల్సిందే. కోతలతో పాటు అధిక ఛార్జీల చెల్లింపునకూ సిద్ధం కావాలి ప్రజలు. ఎందుకంటే విద్యుత్ సరఫరా చేసినా అధిక ధరకు కొనుగోలు అన్నది ఇప్పుడు తప్పనిసరి అని జగన్ చెబుతున్నారు. ఇదే దశలో సానుభూతిని సాకుగా చూపి ఛార్జీలు వసూలు చేస్తారు. ఇందుకు కూడా సిద్ధం కావాలి మనం. విద్యుత్ ఛార్జీల పెంపుదల అన్నది రాష్ట్రాల పరిధి నుంచి కేంద్రం లాక్కోవాలని చూస్తే అప్పుడు ఏమౌతుందని..ఇప్పటికే డిస్కంల ప్రయివేటీకరణకు మొగ్గు చూపుతున్న కేంద్రం ఇకపై రాష్ట్రాలపై పెత్తనానికి మరింత సిద్ధం అవుతుంది.
బొగ్గు, గ్యాస్ అన్నవి ఇప్పుడు కీలకం అయిన విషయాలు.. ఏపీ నుంచి గ్యాస్ తరలిపోయినా, తెలంగాణ నుంచి బొగ్గు తరలిపోయినా స్థానిక అవసరాలు తీరాకే అవి పక్క ప్రాంతాలకు పోవాలి. కానీ ఇక్కడ అవి జరగడం లేదు. ఈ విషయమై ఒకటి మన రాష్ట్రాల తప్పిదాలుండగా, రెండోది ప్రయివేటు కంపెనీలకు దాసోహం అయిన తీరే కొంప ముంచుతోంది. బొగ్గు నిల్వలు లేని కారణంగానే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కావడం లేదని మంత్రి చెప్పినా లేదా సజ్జల చెప్పినా మంచిదే కానీ అందుకు కారణం జగన్ అని ముందు మీరెందుకు ఒప్పుకోవడం లేదు.
సింగరేణి బొగ్గు గనులకు చెల్లించాల్సిన బకాయిలపై మీకెందుకు స్పష్టత లేదు. ఐదు రోజుల పాటు సరిపడా నిల్వలు లేకుండా మీరేం చేస్తున్నారని? పీక్ అవర్ లో 15 రూపాయలకు ఒక్కో యూనిట్ విద్యుత్ ను కొనుగోలు చేయడం ఏంటి? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బాబు హయాంలో కోతలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పెద్దగా సంక్షోభాలు ఉన్న రోజుల్లేవు. జల విద్యుత్ అప్పట్లో పుష్కలం. అదేవిధంగా థర్మల్ విద్యుత్ కూడా అందుబాటులోనే ఉండేది. పెద్ద రాష్ట్రం చిన్న రాష్ట్రాలుగా మారిపోయాక సంక్షోభాలు వస్తున్నాయా లేదా ఉద్దేశ పూర్వక నాటకాలే ఇవన్నీనా?