తెలుగు రాష్ట్రాల్లో సర్కారు చదువుల కష్టాలు..
యునెస్కో నివేదిక ప్రకారం ఏకోపాధ్యాయ పాఠశాలల లెక్క తీస్తే దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఏకోపాధ్యాయ పాఠశాల అంటే.. 50 మంది పిల్లలు ఒకే పాఠశాలలో ఉంటారు. అందులోనే అన్ని తరగతులవాళ్లు ఉంటారు. అన్ని తరగతులకి, అన్ని సబ్జెక్ట్ లకి కలిపి ఒకరే టీచర్. వాటినే ఏకోపాథ్యాయ పాఠశాలలు అంటారు. ఇలాంటి చోట పిల్లలకు పెద్దగా చదువు ఎక్కదు. అలాంటి స్కూల్స్ ఉన్న రాష్ట్రాల లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలు టాప్ లో ఉండటం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాలకు ముందున్న వాటిలో పెద్దగా జనాభా ఉండదు. ఆ లెక్కన చూసుకుంటే తెలుగు రాష్ట్రాలే తొలి రెండు స్థానాల్లో ఉన్నట్టు లెక్క..
ఏపీలో నాడు నేడు అన్నారు.. తెలంగాణలో కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు.. కానీ లెక్కలు మాత్రం తేడాగా ఉన్నాయి. ఇవి ప్రతిపక్షాల విమర్శలు కావు, యునెస్కో విడుదల చేసిన గణాంకాలు. మన తెలుగు రాష్ట్రాలలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 91% పాఠశాలలు గ్రామాల్లోనే ఉన్నట్లు యునెస్కో తెలిపింది. మొత్తం 63,621 స్కూళ్లలో 14.4% ఇలా ఒకే ఉపాధ్యాయుడితో సాగుతున్నట్లు ప్రకటించి సంచలనం రేపింది. ఈ నివేదిక వివరాలు చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో సర్కారు బడులపై ప్రభుత్వాలు మరింతగా దృష్టి పెట్టాలని చెప్పకనే చెబుతున్నాయి. సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెంచి అభివృద్ధి చేసినట్టే.. ఉపాధ్యాయుల సంఖ్యను కూడా పెంచాలి. విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైపై మెరుగులు ఎన్ని ఉన్నా.. తగినంతమంది ఉపాధ్యాయులు లేకపోతే ఆ వనరులన్నీ వృథానే అవుతాయి. ఆ విషయాన్ని గుర్తెరిగితేనే.. ఏకోపాథ్యాయ పాఠశాలల శకం ముగుస్తుంది.