సింగరేణి సంస్థ ఈ ఏడాది వచ్చిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది కంటే ఒకశాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు ముఖ్య మంత్రి కెసిఆర్ దసరా కానుకను అందించారు. అంతే కాకుండా లాభాల్లో వాటాను దసరాకంటే ముందే చెల్లించాలని సిఎండీ శ్రీధర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని ఈ సంధర్బంగా కేసీఆర్ పునరుద్ఘాటించారు. సింగరేణి కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. బొగ్గుతవ్వకంతో పాటు ఇసుక, ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరమున్నదని ముఖ్యమంత్రి సూచించారు.
మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సింగరేణి అభివృద్ధి పై సమీక్ష సమావేశం జరిగింది. బొగ్గుగని మైనింగ్, పవర్ జనరేషన్ నిర్వహణలో దేశంలోనే ఉన్నత స్థానంలో సింగరేణి సంస్థను నిలపడంలో కార్మికుల శ్రమ నైపుణ్యం ఎంతో గొప్పదని సిఎం ప్రశంలు కురిపించారు. నిబద్దతతో నిరంతర శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమం వారి భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్ తెలిపారు.
సింగరేణి కార్మికుల నైపుణ్యాన్ని బొగ్గుతవ్వకంలోనే కాకుండా ఇసుక సున్నపురాయి ఇనుము తదితర ఖనిజాల తవ్వకాలలో వినియోగించుకోవాల్సిన సందర్భం కూడా వచ్చిందని కేసీఆర్ వెల్లడించారు.. దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా తక్షణమే సిద్ధం చేయాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల వాళ్లు రిటైరయిన సింగరేణి కార్మికులను వినియోగించుకుని బొగ్గు తదితర ఖనిజాలను నిర్వహిస్తున్నారని లాభాలు గడిస్తున్నారని అన్నారు. మనమే ఎందుకు ఆ పని చేయకూడదు? లాభాలు వచ్చే అవకాశమున్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటు పరం చేస్తుండడం శోచనీయం అని ప్రైవేటీకరణపై కేసీఆర్ ఆసక్తికర వ్యాక్యలు చేశారు .