సోలార్ సిటీగా మారనున్న బెంగళూరు..!
ఇప్పుడు కర్ణాటక సర్కార్ కూడా సహజ వనరులను వినియోగించుకుంటోంది. తుమకూరు జిల్లాలోని పావగడ తాలుకాలో మెగా సోలార్ పార్కును కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కంటికి కనిపించినంత దూరంలో ఈ సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 12 వేల 800 ఎకరాల్లో ఏర్పాటైన ఈ మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్... ఆసియాలో అతిపెద్దదిగా ఇప్పటికే రికార్డుల్లోకి ఎక్కింది. 2018లో ప్రారంభమైన ఈ ప్లాంట్ నుంచి ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైనట్లు కర్ణాటక సోలార్ పవర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ అధికారులు వెల్లడించారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్... కర్ణాటక రాష్ట్రంలో 15 శాతం అవసరాలు తీరుస్తుందని వెల్లడించారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 2 వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ మెగా సోలార్ విద్యుత్ పార్క్ను రాబోయే రోజుల్లో మరింత విస్తరించాలని సర్కార్ భావిస్తోంది.