తెలంగాణ అసెంబ్లీ : ఆంధ్రా గొడవలు తీరేనా?
చాలా రోజుల తరువాత తెలంగాణ అసెంబ్లీ నుంచి కొన్ని విషయాలపై ప్రజలు స్పష్టత కోరుతున్నారు. వర్షాకాల సమావేశాలు కనుక రోడ్లకు సంబంధించి ఏమయినా మాట్లాడతారా.. ఇదే సమయంలో ప్రాజెక్టులకు సంబంధించి ఏమయినా చర్చిస్తారా అన్నది పలు ఊహాగానాలకు తావిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతున్న విధంగా ఆంధ్రాతో గొడవలు సర్దుమణిగేలా చేస్తుందా లేదా కొత్త వివాదాలు కొత్త ప్రాజెక్టులు ఏమయినా ప్రకటిస్తుందా అన్న ఆసక్తి కూడా ఇప్పుడు నెలకొని ఉంది. ఆంధ్రాతో తేల్చుకోవాల్సిన బకాయిలు ఉన్నాయి. ఇవ్వాల్సిన ఉమ్మడి ఆస్తులూ ఉన్నాయి. వీటిపై తెలంగాణ అసెంబ్లీ మాట్లాడితే బాగుంటుంది అని అంతా ఆశిస్తున్నారు. కేసీఆర్ నుంచి స్పష్టమయిన ప్రకటన ప్రాజెక్టులకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి వస్తే దీనిపై ఆంధ్రా సీఎం చెప్పే మాటలు ఏంటన్నవి తప్పక తెలుస్తాయి. అదేవిధంగా ఉమ్మడి ఆస్తుల లెక్క తేలలేదు. అంతేకాదు విద్యుత్ బకాయిలూ ఉన్నాయని అటు ఆంధ్రా అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. ఇవన్నీ మాట్లాడాలి. కరోనా నివారణకు తెలంగాణ అసెంబ్లీ తరఫున వచ్చే ప్రకటన కూడా మరింత కీలకం కానుంది.
తెలంగాణ అసెంబ్లీ నేటి నుంచి సమావేశం కానుంది. వర్షాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ నిర్ణయం వెలువరించనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఈ సారి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా హైద్రాబాద్ కేంద్రంగా డ్రగ్ రాకెట్ ఒకటి నడుస్తున్నందున దానిపై చర్చ రావొచ్చు. ఈ కేసును ఈడీ విచారిస్తున్నందున కేటీఆర్ ను విపక్షం టార్గెట్ చేసి మాట్లాడేందుకు ఛాన్స్ ఉంది. మరో వైపు చిన్నారి చైత్ర ఘటనకు సంబంధింంచి అసెంబ్లీ ఏమయినా మాట్లాడుతుందా అన్నది కూడా ఆసక్తిదాయకం. కేటీఆర్ దత్తత కాలనీ సింగరేణి కాలనీలో మొన్నటి వేళ జరిగిన ఉదంతంపై ఏం మాట్లాడతారు ఏం ప్రశ్నిస్తారు అన్నది విపక్షాలకు సంబంధించిన విషయం. అలా కాకుండా ప్రభుత్వం తరఫున వచ్చే ప్రకటన ఎలా ఉంటుంది అన్నది కూడా ఇప్పుడిక ఆసక్తిదాయకం. ఇవే కాకుండా కృష్ణా జలాలకు సంబంధించిన వివాదాలపై తెలంగాణ అసెంబ్లీ మాట్లాడనుంది. వివాదాలను తేల్చుకునేందుకు, ఆంధ్రా ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమా కాదా అన్నది కూడా టీ సర్కారు చెప్పనుంది.