మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో తెలుసా ?
ఈ విషయంలో ప్రజల కోణం నుండి ఆలోచిస్తే,
2019 లో ప్రభుత్వం ఏర్పాటయింది. మొత్తం 153 మంది ఎమ్మెల్యేలు మరియు 22 మంది ఎంపీలు అధికార పార్టీ గెలుచుకుంది. వీరిలో ఎంత మంది ప్రజాప్రతినిధులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఒకరు చెప్పడం కాదు. వారికి వారే గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచిస్తే అర్థం అవుతుంది. ప్రజలు వారిపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. అలాంటిది వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత వారిదే. కానీ అందరూ ఇలా చేస్తున్నారా అంటే లేదనే సమాధానం సగానికి పైగా ప్రజల నుండి గద్గద స్వరం వినిపిస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు హాయిగా రాష్ట్ర రాజధాని చుట్టూ దేశ రాజధాని చుట్టూ తిరుగుతూ తమకు ప్రయోజనంగా ఉండే అంశాలపై దృష్టి సారిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల జడ్జిమెంట్. సరిగ్గా గమనిస్తే ఒక్కో నియోజకవర్గంలోని గెలిచిన ఎమ్మెల్యేలు ఎంత మంది నిరంతరం ప్రజలతో టచ్ లో ఉన్నారు.
ప్రజల సమస్యలపై ఎంత మంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు. ఇవన్నీ ఆలోచిస్తే ఏ ఒక్కరూ మళ్లీ ఆ ఎమ్మెల్యేకు ఓటు వేయరు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే 'ఓటింగ్ డే' తర్వాత వారితో పనే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఒక్క విషయం గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. మనల్ని ఎన్నుకుంది ప్రజలు కాబట్టి వారి అవసరాలు, వారి సేవే మీకు పరమావధి. ఇకనైనా మీతీరు మార్చుకోండి ప్రజల మనసును గెలుచుకునే పనిలో ఉండండి. ఈ రోజు ప్రజల అవసరాలను తెలుసుకుని తీరిస్తే...రేపు మీరు ఓట్ల కోసం ఇలా అడుక్కునే పరిస్థితి ఉండదు. ప్రజా బాగోగులు చూసుకునే మిమ్మల్నే ప్రతి ఎన్నికల్లో గెలిపిస్తారు. ప్రజలే మీకు కర్త కర్మ క్రియ. ఈ విషయాన్ని మరిచిపోతే ప్రజలు మిమ్మల్ని మరిచిపోతారు.