టీడీపీ ఈ సారి ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి...

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడుకి ఎంతో రాజకీయ అనుభవం ఉన్నా ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో పార్టీ ఉంది. ఏపీలో మళ్లీ పుంజుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ప్రజల వద్దకు వెళ్ళడం లేదు. కేవలం రాష్ట్రస్థాయిలో టీడీపీ సీనియర్ నాయకులు చేస్తున్న పోరాటాలు క్షేత్ర స్థాయిలో కార్యకర్తల దృష్టికి వెళ్ళడం లేదు. చంద్రబాబు వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీలో గతంలో మంత్రులుగా చేసినవారంతా ఏమైపోయారు. అధికారంలో ఉంటేనే వీరంతా యాక్టివ్ గా ఉంటారా ? పార్టీ భవిష్యత్తు కంటే పదవే ముఖ్యమా ? చంద్రబాబు ఇలాంటి వాటి పైన దృష్టి పెట్టాలి. పార్టీకి విశ్వాసంగా పనిచేసే వారికి మాత్రమే పదవులు ఇచ్చి వారిని మరింత ప్రోత్సహించాలి.
పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ వెన్నంటే ఉండి సేవ చేసిన వారికి సరైన గుర్తింపు ఇవ్వాలి. అప్పుడే వారు రెట్టింపు ఉత్సాహంతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారు. కేవలం పదవులే ప్రధాన లక్ష్యంగా ఉన్న స్థంభాల్లాంటి నాయకులు అందరినీ పార్టీ నుండి ఉద్వాసన పలకాలి. వారి వల్ల పార్టీకి ఉపయోగం ఏమీ లేదని ఇప్పటికైనా బాబు గారు గుర్తించాలి.  పార్టీ ప్రజల్లో మంచి పేరును కలిగి ఉండాలంటే నాయకులు ఇచ్చే ప్రతి సలహాను తీసుకుని, ఒకవేళ ఆ సలహా పార్టీ అభ్యున్నతికి ఉపయోగపడుతుంది అనుకుంటే అమలులో పెట్టాలి. అంతే కానీ వారు చెప్పేది ఏంటి అని నిర్లక్ష్యం చేస్తే మొన్న టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాగే మరి కొందరు పార్టీని వీడే అవకాశం లేక పోలేదు. ఈ సంఘటన పార్టీ కేడర్ కి ఒక వార్నింగ్ బెల్ లాంటిది.
ఒక్కో సారి చిన్న చిన్న సలహాలు పాటించకపోవడం వల్ల కూడా పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇకనుండి టీడీపీ ప్లానింగ్ అంతా మారిపోవాలి. సరి కొత్త టీడీపీ ప్రజల ముందుకు రావాలి. ఇప్పుడు వైసీపీ చేస్తున్న తప్పులను ప్రజల ముందుకు తీసుకెళ్లి వారిలో మార్పు వచ్చేలా కృషి చెయ్యాలి. రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచి అడుగులు వెయ్యాల్సిన అవసరం ఉంది.  ఇక ముందు బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు పార్టీ వీడే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. మొత్తానికి మునుపటిలాగా చంద్రబాబు పోరాట పటిమతో ముందుకు సాగితే విజయం తధ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: