కరోనా: చిన్న పిల్లలకు రక్షణగా మీజిల్స్ వ్యాక్సిన్..!

Suma Kallamadi
భారతదేశంలో విజృంభించనున్న కరోనా థర్డ్ వేవ్ చిన్న పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని స‌ర్వ‌త్రా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పూణేకి చెందిన పరిశోధకులు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. పూణే పరిశోధకులు ఒక స్టడీ నిర్వహించి మీజిల్స్ (తట్టు/పొంగు వ్యాధి) వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల్లో.. వ్యాక్సిన్ తీసుకొని పిల్లల్లో కంటే.. కరోనా తీవ్రత తక్కువగా ఉంటుందని కనుగొన్నారు. మీజిల్స్ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు. ఐతే పూణేలోని బీజే మెడికల్ కాలేజీ నిర్వహించిన ఈ స్టడీలో మీజిల్స్ వ్యాక్సిన్ సార్స్‌కోవ్‌-2 వైరస్ ని ఎదుర్కొనడంలో 87.5% సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది.
ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను హ్యూమ‌న్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునోథెర‌ప్యూటిక్స్ జ‌ర్న‌ల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు మాట్లాడుతూ.. మీజిల్స్ వ్యాక్సిన్ పిల్లలకు కరోనా వైరస్ నుంచి ఎక్కువ కాలం రక్షణ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ ఫలితాలను నిర్ధారించడానికి మరిన్ని ట్రయల్స్ చేయాల్సిన అవసరం ఉందని ఈ పరిశోధకులు చెప్పుకొచ్చారు.
ఈ అధ్యయనం చేసిన పరిశోధకులలో ప్రధాన పరిశోధకుడు అయిన డాక్ట‌ర్ నీలేష్ గుజార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా (పిల్లలు-మీజిల్స్ వ్యాక్సిన్లపై) చేసిన అధ్యయనం ఇదే. సార్స్‌కోవ్‌-2 లో ఉన్న అమినో యాసిడ్ సీక్వెన్స్ 30% వరకు రూబెలా వైర‌స్‌ లోని అమినో యాసిడ్ సీక్వెన్స్ లాగానే ఉంది. అందుకే మేము అధ్యయనం కోసం ఎంఎంఆర్ వ్యాక్సిన్ల‌పై దృష్టి పెట్టాము. (ఎంఎంఆర్ వ్యాక్సిన్ మీజిల్స్, ముంప్స్, రుబెల్లా వ్యాధులను ఎదుర్కొనేందుకు ఉపయోగిస్తారు). సార్స్‌కోవ్‌-2 వైరస్ లోని స్పైక్ ప్రొటీన్.. మీజిల్స్ వైర‌స్‌లోని హెమాగ్లుటినిన్ ప్రొటీన్‌లాగానే ఉంది. ఈ కారణంతోనే మేము వాటిపై స్టడీ చేసాము. ఫ‌లితాలు కూడా ఆశాజనకంగా వచ్చాయి" అని వెల్లడించారు.
ఇక కరోనా వైరస్ బారిన పడిన పిల్ల‌ల్లో సైటోకైన్ స్టార్మ్‌ల‌ను నిర్మూలించేందుకు ఎంఎంఆర్ వ్యాక్సిన్ దోహద పడతాయని రీసెర్చ్ లో తెలినట్లు పరిశోధకులు తెలిపారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు చిన్న పిల్లలు త్వరగా మీజిల్స్ వ్యాక్సిన్ తీసుకోవాలని.. ఫస్ట్ డోసు తీసుకున్న పిల్లలు త్వరగా రెండో డోసు కూడా తీసుకోవాల‌ని పరిశోధకులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: