విగ్రహాల ధ్వంసంపై పవర్ స్టార్ ఆగ్రహం.. సీఎంపై మండిపాటు!
‘రాష్ట్రంలో హిందూ విశ్వాసాలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా మర్లబండలో ఆంజయనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న సీతారామచంద్రుల విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. గడిచిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలు, విగ్రహాలు అపవిత్రం అవుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. దీని వల్లే మతోన్మాదులు ఇలాంటి ఘాతుకాలకు తెగ బడుతున్నారు. పొరుగున ఉన్న శత్రుదేశంలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే అక్కడి ప్రభుత్వం 45 మంది నిందితులను అదుపులోకి తీసుకుంది. ఆ ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత కూడా తీసుకుంది. శత్రు దేశమే ఇలాంటి చర్యలు తీసుకుంటే.. జగన్ రెడ్డి ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదా?’ అని నిలదీశారు.
శక్తిపీఠం ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం ఘటన నుంచి తాజాగా రామతీర్థం, రాజమహేంద్రవరం వరకూ హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను పవన్ గుర్తు చేశారు. ఇప్పుడు తాజాగా మర్లబండలో విగ్రహాలను పగలగొడుతున్నా, రథాలను తగలబెడుతున్నా ప్రభుత్వ స్పందన ఉదాసీనంగా ఉందని మండి పడ్డారు. ప్రభుత్వం ఇలా నిర్లిప్తంగా ఉండటం వల్ల మరిన్ని దేవాలయాల్లో ఇలాంటి విధ్వంసాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.