ఏపీలో వంట గ్యాస్ సిలిండర్లపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుభారం మోపిందంటూ టీవీ చానళ్లు, వెబ్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఎల్పీజీ గ్యాస్ ధర పెంచారంటూ చేస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండిచింది. ఈమేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. వంట గ్యాస్ ధర పెంచకపోయినా.. పెంచారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆపాలని, ప్రజలను గందరగోళంలోకి నెట్టడం సరికాదని అన్నారు అధికారులు. టీవీ ఛానెళ్లలో వచ్చే వార్తలు చూసి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన వివరణతో వీరంతా వెనక్కి తగ్గారు.
కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆదాయం భారీగా పడిపోయినందున దాన్ని పూడ్చుకునేందుకు నాచురల్ గ్యాస్ ధరలను పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం ఒక జీఓ విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్లో ఆదాయం 4వేల 480 కోట్లు రాగా… ఈసారి కరోనా వల్ల ఏప్రిల్లో కేవలం 1323 కోట్లు మాత్రమే వచ్చిందని జీఓలో వివరించింది. మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లోనూ అదే పరిస్థితి ఉందని వివరించింది. అందుకే నాచురల్ గ్యాస్పై టాక్స్ను 14.5 శాతం నుంచి 24.5 శాతానికి పెంచుతున్నట్టు ప్రభుత్వం జీఓలో వివరించింది. ఈ జీఓని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నాయి. టీవీ చానళ్లలో ఏపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచేసిందని, ఎల్పీజీ సిలిండర్ రేటు పెరిగిందంటూ కథనాలను ప్రసారం చేశారు.
ఈ ప్రచారం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరపున స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్ ప్రకటన విడుదల చేశారు. ఎల్పీజీ గ్యాస్ ధరలు పెంచారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని ఆయన వివరణ ఇచ్చారు. ప్రభుత్వం స్వల్పంగా ట్యాక్స్ పెంచింది సహజవాయువుపై అని… దీన్ని పరిశ్రమల్లో, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో వాడుతుంటారని వివరణ ఇచ్చారు. వంట గ్యాస్ ధరలను పెంచలేదని వెల్లడించారు. కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాల్లో అవగాహన చేసుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రజత్ భార్గవ్ తన ప్రకటనలో అభ్యంతరం తెలిపారు. వంట గ్యాస్ సిలిండర్ రేటులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.