ముంబయిలో మరో వివాదం... రంగంలోకి రాజ్నాథ్ సింగ్
ఏంటీ వివాదం
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను కించపరిచేవిధంగా ఉన్నఓ కార్టూన్ను వాట్సాప్లో దర్శనమిచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవర్ లకు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే నమస్కరిస్తున్నట్లు ఆ కార్టూన్ ఉంది. అయితే ఆ కార్టూన్ ముంబైలోని కండవల్లి ఈస్ట్ లో నివాసం ఉంటున్న 65 ఏళ్ల ఓ మాజీ నేవీ అధికారి మదన్ శర్మకు వాట్సాప్లో కనిపించడంతో, అయన దాన్ని వారి రెసిడెన్సీ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసారు. దీంతో ఆ విషయం శివసేన కార్యకర్తల దృష్టికి చేరింది. ఆ కార్టూన్ చూసిన కమలేష్ కదమ్ అనే శివసేన కార్యకర్త మదన్ శర్మకు ఫోన్ చేసి,తన ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు. వెంటనే అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని శర్మను బయటకి పిలిచి కొంతమంది శివసేన కార్యకర్తలతో శర్మపై దాడి చేసారు. ఈ దాడిలో శర్మ ముఖం మీద మరియు కన్న మీద గాయాలయ్యాయి.
మాజీ నేవీ అధికారిపై దాడి జరగడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. మాజీ సైనికులపై దాడులు చేయడాన్ని ఏ మాత్రం సహించేది లేదని ట్వీట్ చేసారు. శివసేన కార్యకర్తల చేతిలో దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్ శర్మతో మాట్లాడినట్లు చెప్పారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీసానని, మదన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలో రక్షణ లేదని నేవీ మాజీ అధికారి మదన్ శర్మ ఆవేదన వ్యక్తం చేసారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని... మళ్లీ ఎన్నికలను నిర్వహించాలన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి కమలేష్ కదమ్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మహారాష్ట్రలో ఎన్నో ఉద్రిక్తల మధ ఏర్పడిన శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రతికూలంగా ఏ చిన్న అంశం దొరికిన... బీజేపీ దానిని రాజకీయంగా ఉపయోగించుకుంటుందని అంటున్నారు.