విశాఖ యువతికి అరుదైన గౌరవం.. !

NAGARJUNA NAKKA
విశాఖకు చెందిన బాక్సర్‌ నగిశెట్టి ఉష తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి చూపించింది. ప్రపంచ స్థాయి బాక్సింగ్ పోటీల్లో తన పంచ్ లతో ప్రత్యర్థులను మట్టికరిపించింది. 2006లో ఢిల్లీలో జరిగిన ప్రపంచస్ధాయి పోటీల్లో రజత పతకాన్ని సాధించి గర్వకారణంగా నిలిచింది. 2008లో చెన్నైలో జరిగిన ప్రపంచస్థాయి పోటీల్లో మరోసారి పాల్గొని రజతం కైవసం చేసుకుంది. అదే ఏడాది గువాహటిలో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా స్వర్ణ పతకం సాధించి మరోసారి సత్తా చాటింది. అంతర్జాతీయ ఆహ్వానపు పోటీల్లో డెన్మార్క్‌లో స్వర్ణం, టర్కీలో రెండు కాంస్యాలు, కెనడాలో స్వర్ణం, రెండు రజతాలు, కొరియాలో రెండు స్వర్ణాలు, రజత పతకం తన ఖాతాలో వేసుకుంది.
2004 నుంచి 2010 వరకు వరుసగా ఏడు సంవత్సరాల పాటు జాతీయస్థాయిలో ఛాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించింది.ఒలింపిక్స్‌లో మెడల్ సాధించాలనుకుంది. కానీ గాయాలతో ఆటకు దూరమైంది. ఆ తర్వాత రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు భారత మహిళా జట్టుకు కోచ్‌గా ఉష సేవలందిస్తున్నారు. ఇప్పుడు ఆమె రెండేళ్ల పాపకు తల్లి. అయినప్పటికీ తన అనుకున్నలక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తోంది. ఆమెకు కుటుంబసభ్యుల నుంచి మంచి సహకారం అందుతోంది.
క్రీడాకారిణి నుంచి కోచ్‌గా మారి ఒలింపిక్స్‌ బాక్సర్లను తీర్చిదిద్దడమే ధ్యేయంగా పెట్టుకున్న ఉష కృషిని కేంద్రం గుర్తించింది. ధ్యాన్‌చంద్‌ అవార్డుతో సత్కరించింది. ఈ నెల 29న జరిగే క్రీడా దినోత్సవ సందర్భంగా ఉషకు ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఉషకు అవార్డు రావడంతో కుటుంబ సభ్యులు, విశాఖవాసులు సంతోషపడుతున్నారు.
వెంకటరమణ కుమార్తె ఉష. తన కూతుర్ని కూడా తనలాగే బాక్సర్‌ని చేయాలని చిన్నప్పటి నుంచి ప్రోత్సహించాడు.  పదేళ్ల వయసు నుంచి  చిచ్చర పిడుగులా ప్రత్యర్ధుల పై పంచ్ లతో దూకుడు విరుచుకుపడేది.  తరువాత బాక్సింగ్‌ శిక్షణలో రాటుదేలింది ఉష. ఉషకు ధ్యాన్ చంద్ పురస్కారం దక్కడం పట్ల యావత్ తెలుగు సమాజం గర్విస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: