భారీ ప్రమాదం.. LPG సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో మంటలు..
రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కొట్టాయం అండ్ ఎర్నాకుళం మార్గం మధ్యలో LPG సిలిండర్లతో ట్రక్ వెళ్తోంది. ఈ క్రమంలో ఇంజిన్లో సడన్ గా పొగలు వ్యాపించడంతో గమనించిన డ్రైవర్ రాహుల్ రాజ్ కుమార్ వెంటనే వాహనాన్ని పక్కకు నిలిపి వేసి, బ్యాటరీ కనెక్షన్ పూర్తిగా తొలగించి, దానికి దూరంగా నిలబడ్డాడు. అనంతరం ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందిన వెంటనే.. మూలాంతురుతి ఫైర్ స్టేషన్ నుండి ఒక ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ యూనిట్ క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పి వేయడం వలన పెను ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఫైర్ అధికారి ఒకరు.. సిలిండర్లు ఖాళీగా ఉన్నప్పటికీ పేలుడు సంభవించే అవకాశం ఉందని, కానీ డ్రైవర్ తన తెలివితో బ్యాటరీకి వున్న విద్యుత్ కనెక్షన్ తొలగించారని, లేదంటే భారీ ప్రమాదం జరిగేదని అధికారి తెలిపారు.
లారీ సుమారు 50 ఖాళీ వంట గ్యాస్ సిలిండర్లతో రోడ్డుపై వెళ్తోంది. ఈ ఘటన సరిగ్గా ఉదయం 10.15 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. పెరూర్ ప్లాంట్ రీఫ్యూయలింగ్ కోసం లారీ వెళ్తోంది. ఇది కొట్టాయం కేంద్రంగా ఉన్న హిందుస్తాన్ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినదిగా తెలుస్తోంది. కాగా.. జిల్లా అగ్నిమాపక అధికారి ASGO సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.