తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం..
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొద్దిరోజులుగా పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏపీకి ఉన్న హక్కు ప్రకారమే కృష్ణా జలాలను వాడుకుంటున్నామని, ఇందులో భాగంగానే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం చేపడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు. మరోవైపు.. ఏపీ జారీ చేసిన 203 జీవో తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలిగిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ఎలాగైనా.. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుని తీరుతామని అన్నారు. ఇక ఈ వివాదం రోజురోజుకూ ముదురు తుండగానే తాజాగా మరో వివాదం తలెత్తింది. ఈ వివాదం కర్నూలు జిల్లాలో ఉన్న గుండ్రేవ్ వద్ద తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలకు సంబంధించినది. ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాహనాలు ఇసుక తవ్వకాలు చేపడుతుండగా తెలంగాణ అధికారులు సీజ్ చేశారు. అయితే తమ సరిహద్దులోనే తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టినటు కర్నూలు జిల్లా అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల అధికారులు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంపై సర్వే చేపట్టినట్లు తెలిసింది. అయితే ఈ విషయం ఎటూ తేలక పోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. తమ ప్రాంతంలోనే ఇసుక తవ్వకాలు చేపట్టినట్లు కర్నూల్ అధికారులు చెబుతున్నారు. అయితే అసలు ఆ ఇసుక తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ అధికారులు అనుమతి ఇచ్చారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే తెలంగాణ అధికారులు సీజ్ చేయడం కరెక్టేనని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి వివాదాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీస్తాయని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు కూర్చుని మాట్లాడుకొని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. లేనిపక్షంలో చిన్నచిన్న వివాదాలే పెద్దగా మారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పెద్దలు ఏం చేస్తారో చూడాలి మరి.