ఇంటింటికీ సిలిండ‌ర్ల‌న్నావు...ఇంత ఘోరం చేస్తున్న‌వేంది మోదీజీ?

Pradhyumna

దేశంలోని అర్హులంద‌రికీ ఎల్‌పీజీ గ్యాస్ క‌నెక్ష‌న్లు ఇప్పించాల‌నే ల‌క్ష్యాన్ని త‌మ స‌ర్కారు నెర‌వేరుస్తోంద‌ని కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు ప‌లు ద‌ఫాలుగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యం ఫ‌లితాలు ఇచ్చింది. అనేక‌మంది ప్ర‌ముఖులు స‌బ్సిడీ వ‌దులుకున్నారు. అయితే, ఈ విష‌యంలో మ‌రో షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. నాన్‌-సబ్సిడీ వంటగ్యాస్‌ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్‌పై రూ.19 పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇలా పెరుగడం వరుసగా ఇది ఐదో నెల కావడం గమనార్హం. పెరిగిన ధరలు అమల్లోకి వచ్చేశాయి.

 

ఎల్‌పీజీ వినియోగదారులకు ఏటా 12 సిలిండర్లు రాయితీ ధరలకు అందుతున్నాయి. ఆపై సిలిండర్లు మార్కెట్‌ ధరకు లేదా నాన్‌-సబ్సిడీ ధరలకు కొనుక్కోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం ఢిల్లీలో సబ్సిడీ వంట గ్యాస్‌ ధర రూ.495.86గా ఉన్నది. కస్టమర్ల ఖాతాల్లోకే నేరుగా సబ్సిడీ సొమ్ము జమవుతున్న సంగతి విదితమే.  అయితే, గ‌త ఏడాది సెప్టెంబర్‌ నుంచి రాయితీ లేని ఎల్‌పీజీ సిలిండర్‌ ధర క్రమేణా పెరుగుతుండగా, వినియోగదారులపై ఇప్పటిదాకా రూ. 139.5 భారం పడింది. ఆగస్టు 1న రూ.574.5గా ఉన్న సిలిండర్‌ ధర సెప్టెంబర్‌ 1న రూ.590కి పెరిగింది. ఆ తర్వాతి నుంచి ప్రతి నెలా ఒకటిన పెరుగుతూనే వస్తోంది. తాజా పెంపు నేపథ్యంలో 14.2 కిలోల సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.714కు చేరింది. ఇంతకుముందు ధర రూ.695గా ఉన్నది. 

 


ఇదిలాఉండ‌గా, ముంబైలో ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)ల ద్వారా విక్రయించే కిరోసిన్‌ లీటర్‌ ధర 26 పైసలు పెరిగి రూ.35.58కి చేరింది. కిరోసిన్‌పై సబ్సిడీ పోయేంత వరకు ప్రతి నెలా లీటర్‌కు 25 పైసల చొప్పున ధరలను పెంచాలని 2016లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ కిరోసిన్‌ రహిత ప్రాంతంగా ఉన్నది. ఇక్కడ పీడీఎస్‌ కిరోసిన్‌ అమ్మకాలు లేవు. దీంతో ముంబై ప్రామాణికంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: