నువ్వా నేనా అన్నట్లుగా కారుకు, కాంగ్రేస్కు మద్య ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నిక పోరులో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరో తెలిసే సమయం ఆసన్నమైంది. ఈ రోజు అంటే 24వ తేదీ గురువారం ఉదయం 8 నుంచి సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. కాగా ఈ ఎన్నికలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాల్లో 302 పోలింగ్ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. ఇక ఈ ఓట్ల లెక్కింపు మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో పూర్తిచేయనున్నారు. ఒక్కో రౌండ్లో సుమారు 9 వేలపై చిలుకు ఓట్లను లెక్కిస్తారు.
ఇకపోతే ఈ పక్రియకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఎన్నికల పరిశీలకుడు సచీంద్రప్రతాప్ సింగ్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దుగ్యాల అమయ్కుమార్ పరిశీలించారు. ఇక ఈ ఓట్ల లెక్కింపు నేరేడుచర్ల మండలం నుంచి ప్రారంభమై వరుసగా పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్నగర్ మండలం, పట్టణం, గరిడేపల్లి మండలంలోని లెక్కింపుతో పూర్తవుతుంది. ఇదేగాకుండా లెక్కింపు అంతా పూర్తయ్యాక వీవీప్యాట్ స్లిప్పులు లెక్కిస్తారు. ఆతర్వాత 302 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వరుసగా 1వ నంబర్ నుంచి 302 వరకు అంకెలను ఒక్కో స్లిప్పుపై వేసి. వీటిలో 5 స్లిప్పులు డ్రా తీస్తారు. ఈ డ్రాలో వచ్చిన పోలింగ్ కేంద్రం స్లిప్పు ఆధారంగా ఆ పోలింగ్ బూత్లోని వీవీప్యాట్ స్లిప్పులు లెక్కిస్తారు..
అంతేకాకుండా ఈ స్లిప్పులను, ఇదే పోలింగ్ బూత్లోని ఈవీఎంలలో ఆయా పార్టీకి పడిన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూస్తారు. ఇది పూర్తయ్యాక అభ్యర్థులు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే తుది ఫలితం మధ్యాహ్నం 12 గంటల వరకు వెలువడుతుందని అప్పుడు రిటర్నింగ్ అధికారి గెలిచిన అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారని, అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటికే ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్, టీఆర్ఎస్, అభ్యర్థుల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై ఎక్కువగా బెట్టింగ్లు పెట్టినట్లు సమాచారం. కాగా పెద్దమొత్తంలో మెజార్టీ పార్టీ కారు పైనే బెట్టింగ్ పెట్టారని అనుకుంటున్నారట..