ప్రపంచంలో ఆకాశహర్మ్యాలకు పెట్టింది పేరు దుబాయ్. ఇక్కడ ఎన్నో భవనాలు అత్యంత ఎత్తుగా నిర్మించి ఉంటాయి. విలాసవంతమైన సౌకర్యాలు కలిగిన ఇలాంటి భవనాల్లో నిత్యం సందర్శకులు విడిది చేస్తుంటారు. తాజాగా దుబాయ్ లో మెరినా ప్రాంతంలో టార్చ్ టవర్లో అగ్నిప్రమాదం సంభవించింది. దుబాయ్లోని అత్యంత ఎత్తయిన నివాస భవన సముదాయాల్లో ఇది అయిదవది.
676 డబుల్ బెడ్ రూం అపార్ట్ మెంట్లతో పాటు షాపింగ్ మాల్ లు, ధీమ్ పార్కులకు నెలవైన టార్చ్ టవర్ ప్రపంచంలోనే 32వ ఎత్తైన భవంతిగా వినుతికెక్కింది. అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం, సివిల్ డిఫెన్స్ విభాగం అధికారులు హుటాహుటిన టార్చ్ టవర్ వద్దకు చేరుకున్నారు.
టార్చ్ టవర్ నివాస సముదాయం కావడంతో.. ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మంటలు అంటుకున్న వెంటనే.. ఇళ్లల్లోని జనాలను…సురక్షిత ప్రాంతాలకు తరలిచారు..అధికారులు. దీంతో..ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. దాదాపు కొన్ని గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలు ఆర్పేశారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయని సివిల్ డిఫెన్స్ విభాగం ప్రకటించింది.