ఆఫ్ఘనిస్తాన్లో దారుణం.. కిడ్నీలు అమ్మేస్తున్నారు?
ఆర్థిక సంక్షోభం ఆహార సంక్షోభం చుట్టుముడుతూ ఉండటంతో అటు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలందరూ కనీసం తినడానికి తిండి కూడా లేక అల్లాడిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడానికి ఎలాంటి పని కూడా లేకపోవడంతో కుటుంబాలని పోషించడం ప్రతి ఒక్కరికి భారంగా మారిపోతుంది. దీంతో కుటుంబ సభ్యులు అందరూ ఆకలితో అల్లాడి పోతుంటే చూసి తట్టుకోలేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎంతోమంది. ఏకంగా శరీరంలోని అవయవాలను అమ్ముకొని మరి ఇంట్లో వాళ్ళకి కడుపు నింపేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇంట్లో ఉన్న చిన్నారులకు కడుపు నింపేందుకు, చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ఎంతోమంది వారి జీవితాలను పణంగా పెడుతున్నారు.
ప్రస్తుత సమయంలో ఏం పని దొరకడం లేదు బయటకు వెళ్లి డబ్బులు బిచ్చగాడిలా అడుక్కో లేను అందుకే ఆసుపత్రికి వెళ్లి నా కిడ్నీని లక్షా అరవై తొమ్మిది వేలకు అమ్మేశాను. ఆ డబ్బులతో నా పిల్లలకు కొంతకాలమైన తిండి పెడతాను కానీ వారి ఆకలి కేకలు చూడలేక పోతున్నాను అంటూ గులాం హజ్రత్ అనే ఒక తండ్రి తన మనసులో బాధ బయట పెట్టాడు. కేవలం ఇది ఒక తండ్రి బాధ కాదు దాదాపు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రతి తండ్రి కూడా ఇలాగే బాధ పడుతున్నాడు అన్న విషయం అర్థమవుతుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి చావులు తప్పవు అన్నది ప్రస్తుతం నిపుణులు వేస్తున్న అంచనా. అయితే ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్థాన్లో ఇలా కిడ్నీల విక్రయాలు భారీగా పెరిగిపోయాయి అని తెలుస్తోంది. కిడ్నీ దాత కొనుగోలుదారులు పరస్పర అంగీకారంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని అక్కడి వైద్యులు కూడా చెబుతున్నారు.