సాహో’కు కష్టాలు తప్పవా..!
బాహుబలి ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘సాహో హిందీలో రూ.100 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. సాహో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ భాషల్లో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే యూవీ క్రియేషన్స్లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో కలుపుకొని మూడు రోజుల్లో దాదాపు 300 కోట్ల కలెక్షన్లు రాబట్టింది
ఇకపోతే మూడు రోజలుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సాహో ఇప్పుడు కాస్త వెనుకపడ్డట్లు తెలుస్తోంది. సోమవారం వినాయక చవితి ఉండటంతో వసూళ్లు పెద్దగా రాబట్టలేకపోయింది. ముఖ్యంగా దీని ప్రభావం హిందీ వెర్షన్పై పడింది. హిందీలో వసూళ్లు 50 శాతానికి పైగా పడిపోయి రూ.14 కోట్లు మాత్రమే రాబట్టింది. గత నాలుగు రోజులుగా బాలీవుడ్లో పలు రికార్డులను బద్దలు కొడుతూ రూ.93 కోట్లు వసూళ్లు సాధించిన సాహో సెంచరీకి చేరువలో ఉంది. ఎలాగోలా సాహో హిందీలో సెంచరీ కొట్టడం ఖాయం. అయితే సాహోకు అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. సెలవులు పూర్తయ్యాయి. మరి ఇప్పుడు నిజంగా సగటు ప్రేక్షకుడు థియేటర్కు వెళ్లి చూస్తాడా లేదా అనేది తేలాల్సి ఉంది.
ఇక అనవసర సీన్లు ఉన్నాయని, స్క్రీన్ప్లే సాగదీసినట్టుగా ఉందంటూ పలువురు సినిమాపై విమర్శలు గుప్పించారు. మూడు సంవత్సరాల తర్వాత ప్రభాస్ సాహో చిత్రంతో ప్రేక్షకులను ముందుకు రావడంతో భారీ అంచనాలతో హైప్ క్రియేట్ అయినా చివరకు ఉసూరుమనిపించిందని పెదవి విరిచారు. హాలీవుడ్ డైరెక్టర్ జేరోమ్ సల్లే తన ‘లార్గో వించ్’ సినిమాను కాపీ కొట్టి సాహోను చిత్రీకరించారని సాహో యూనిట్పై మండిపడ్డారు. గతంలోనూ లార్గో వించ్ చిత్ర కథా కథనాలను కాపీ చేసి అజ్ఞాతవాసి తీశారని, దీనిపై పోరాడుతానని చెప్పినా..అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో నిమ్మకుండిపో యారు.
ఇప్పుడు సాహో కూడా కాపీ సినిమా అంటూ కామెంట్ వచ్చాయి. కనీసం కాపీ కొట్టడమైనా కరెక్ట్గా చేయండి అంటూ తెలుగు దర్శకులకు చురకలంటించారు. సాహోపై విమర్శలు రావటం ఇది మొదటిసారేం కాదు.. గతంలోనూ బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్ అనుమతి తీసుకోకుండా తన ఆర్ట్ను సినిమాలో సెట్ డిజైన్ వాడుకున్నారని ఆరోపించారు.