క్రేజీ హీరో విజయదేవరకొండ తమ్ముడు ఆనంద్దేవరకొండ- శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం దొరసాని.
కె.వి.ఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మధురా ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాగా ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ అవుతోన్న సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి కె.వి.ఆర్ మహేంద్ర వెల్లడించిన ఆసక్తికర విశేషాలు మీ కోసం....
మీ గురించి...
మాది వరంగల్ జిల్లాలోని జయగిరి అనే ఊరు. అందరూ లాగే నేను ఎన్నో సినిమా కష్టాలు పడ్డాను. అయితే నేను చేసిన ‘నిశీధి’ అనే షార్ట్ ఫిల్మ్ వల్ల నా లైఫ్ లో మార్పులు వచ్చాయి. ఆ షార్ట్ ఫిల్మ్ నన్ను నాకు పరిచయం చేసింది. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి నా దర్శకత్వాన్ని ప్రశంసిస్తూ.. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ నాకు మెయిల్ చేశారు. దాంతో నా మీద నాకు నమ్మకం పెరిగి, కొత్తగా చేయాలనే ఉద్దేశ్యంతో మొదలైన నా ప్రయాణ ఇలా దొరసాని సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను.
‘నిశీధి’ షార్ట్ ఫిల్మ్ ..
నేను ‘నిశీధి’ షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యాను. తరువాత.. నేను మూడు సంవత్సరాలు ఏ పని చేయకుండా దొరసాని స్క్రిప్ట్ రాశాను. దాదాపు 42 వర్షన్స్ రాసాను. ఈ రోజు దొరసానిగా సినిమా రాబోతుందంటే.. అది కేవలం స్క్రిప్ట్ కున్న బలం వల్లే.
మూడు సంవత్సరాలు స్క్రిప్ట్ రాసేంత కొత్త అంశాలు ఏమి ఉన్నాయి ...
ఇప్పటికే లవ్ స్టోరీలు చాలా చూశాం. మళ్లీ దొరసాని ఎందుకు చూడాలి..? ఎందుకంటే.. దొరసాని సెటప్ అండ్ స్టోరీ వరల్డ్ చాలా కొత్తగా ఉంటుంది. రెండు గంటల పదిహేను నిముషాలు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లి కొత్త అనుభూతిని ఎక్స్ పీరియన్స్ చేస్తాం. ముఖ్యంగా దొర వ్యవస్థ ఆ రోజుల్లో పరిస్థితులను అప్పటి వరల్డ్ కు ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీను యాడ్ చేసి.. ఈ సినిమా చేయడం జరిగింది. ముందు నేను ఆ స్టోరీ వరల్డ్ ను అర్ధం చేసుకోవడానికి.. దాదాపు ఎనిమిది నెలలు ఆ స్టోరీ వరల్డ్ కి సంబంధించి బుక్స్ చదివి.. అర్ధం చేసుకుని ఈ సినిమా చేశాను.
కమర్షియల్ అంశాలు ఉండాల్సిన స్థాయిలో ఉంటాయా ...
అన్ని కమర్షియల్ అంశాలు దొరసానిలో ఉంటాయి. ఫ్యూర్ లవ్ స్టోరీతో పాటు మంచి కాన్ ఫ్లిక్ట్ కూడా సినిమాలో ఉంటుంది. ఖచ్చితంగా కథ కథలోని స్వచ్ఛత, నిజాయితీ అందరికీ నచ్చుతుంది.
ఆనంద్ దేవరకొండ గురించి ...
రాజు పాత్ర అనే రియలిస్టిక్ పాత్రలో ఆనంద్ కనిపిస్తాడు. రాజు సన్నివేశాలు కూడా చాలా సహాజంగా అనిపిస్తాయి. తన పాత్రతో పాటు మిగిలిన పాత్రలు కూడా రియల్ లైఫ్ కి చాల దగ్గరిగా ఉంటాయి. ప్రేక్షకులు సినిమాకు బాగా కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది.
శివాత్మిక గురించి ...
నేను దొరసాని ఎలా ఉండాలి అని ఊహించానో.. శివాత్మిక సేమ్ అలాగే ఉంటుంది. నా పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేశారు. నిజంగా ఆమె అద్భుతంగా నటించింది. దొరసాని పాత్రకు తగట్లే ఆమె నటన చాల సహజంగా అనిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే శివాత్మిక లేకపోతే దొరసాని లేదు.
ఇంతకీ సినిమా హ్యాపీ ఎండింగా లేదా శాడ్ ఎండింగా ...
కథకు అనుగుణంగానే ముగింపు ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు కూడా నేను ఏదైతే ఫీల్ అయ్యానో.. అదే ఫీల్ అవుతారు. ఇక ముగింపు ఎలా ఉంటుందో సినిమా చూసి తెలుసుకోండి.
మీ తదుపరి సినిమాలు...
ఇంకా తెలియదు అండి. రాజశేఖర్ గారు అయితే నీ తరువాత సినిమా నాతోనే చెయ్యాలి అని ఇప్పటికే చాలాసార్లు నవ్వుతూ అడిగారు. అలాగే విజయ్ దేవరకొండగారు కూడా కథ ఉంటే చెప్పు అని అడిగారు. దొరసాని రిలీజ్ తరువాతే.. నా తరువాతి సినిమా డిసైడ్ అవుతుంది.