"మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ తీసి టాలీవుడ్ లో దర్శకుడిగా ముద్ర వేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని దక్కించుకున్నారు వీఎన్ ఆదిత్య. ఈ రెండు సినిమాలు ఇప్పటికీ కూడా ప్రేక్షకులని ఎంతగానో అల్లరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాల్లోని పాటలు ఇప్పటికీ కూడా శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలతో ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది.దాదాపు పాతికేళ్ల నుంచి సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న వీఎన్ ఆదిత్యకు మరో గౌరవం దక్కింది.
అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూర్ లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వివిధ రంగాలలోని ప్రముఖులకి గౌరవ డాక్టరేట్ లను ప్రదానం చేసి గౌరవించింది.అందులో భాగంగా సినిమా రంగం నుండి సీనియర్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య డాక్టరేట్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప ఇంకా సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి అలాగే జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ డైరెక్టర్ నీలమణి మరియు నేషనల్ sc & st కమిషన్ సభ్యుడు దినేష్ గురూజీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఇక ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్ అందుకున్న వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.."నాకు వచ్చిన ఈ డాక్టరేట్ గౌరవాన్ని మా అమ్మగారికి అంకితం చేస్తున్నాను. నేను సినీ రంగంలోనే కాకుండా విద్యారంగంలో కూడా ఉన్నతస్థాయిలో ఉండాలని మా అమ్మ కోరుకుంది. నేను ఇష్టపడిన సినిమా రంగంలో డాక్టరేట్ పొందడం నాకే కాదు అమ్మకు కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. నాకు గౌరవ డాక్టరేట్ అందించిన అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వారికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు చెబుతున్నాను." అని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.