RGV 'వ్యూహం' మరోసారి పోస్ట్ పోన్..

Anilkumar
టాలీవుడ్ లో కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే అందరూ చెప్పే పేరు RGV. ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా పొలిటికల్ జోనర్‌లో సినిమాలు తెరకెక్కిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, రాజకీయ నాయకుల పరిస్థితి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈయన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. మొదటి నుంచే ఈ సినిమా వివాదాలను ఎదుర్కొంటూనే వచ్చింది. ఎన్నో అవాంతరాలను దాటిన తర్వాత ఎట్టకేలకు ఫిబ్రవరి 23 న 'వ్యూహం' అలాగే మార్చ్ 1న 'శపథం' విడుదలను ప్రకటించారు. 

అంతేకాదు రాంగోపాల్ వర్మ ప్రెస్ మీట్స్ పెట్టి మరి ప్రమోట్ చేశారు. కానీ మరోసారి సినిమా రిలీజ్ వాయిదా పడిందంటూ ఆర్జీవి తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమధ్య ఓసారి నారా లోకేష్ ఈ సినిమాపై కేసు వేయడంతో రిలీజ్ ఆపేశారు. అయితే ఈసారి సినిమా రిలీజ్ వాయిదా పడడానికి నారా లోకేష్ కారణం కాదని స్వయంగా ఆర్జీవి స్పష్టం చేశారు. అందుకు అసలు కారణం కూడా చెప్పారు. ఈసారి టెక్నికల్ ఇష్యూస్ తో పాటూ సినిమా కోసం ఇంకా మరిన్ని ప్రమోషన్స్ చేస్తే థియేటర్స్ లో మంచి రీచ్ ఉంటుందని, అందుకే సినిమాను వాయిదా వేసినట్టు తెలిపారు.

మార్చి 1న 'వ్యూహం', మార్చి 8న 'శపథం' సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలిపారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ మరణాంతరం ఆయన కుమారుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమత్రి అయ్యే వరకు తొలి ఫస్ట్‌ పార్ట్‌ ఉండనుందని ఇప్పటికే ఆర్జీవీ తెలిపాడు ఇక వ్యూహం సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. జగన్ భార్య వైఎస్ భారతి పాత్రలో మానసా రాధాకృష్ణన్ కనిపించనుంది. ధనుంజయ్  ప్రభూనే, సురభి ప్రభావతి, రేఖా నిరోషా, వాసు ఇంటూరి, కోటా జయరామ్, ఎలినా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రామధూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: