తన కొత్త సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు నటుడు వరుణ్ తేజ్.ఈయన హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించిన చిత్రమిది. మానుషి చిల్లర్ హీరోయిన్ . వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ చిత్రంలో చూపించనున్నారు. మార్చి 1న సినిమా విడుదల కానున్న సందర్భంగా వరుణ్.. హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ (విమెన్)లో సందడి చేశారు. మూవీ విశేషాలతోపాటు వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు.పెళ్లి తర్వాత మీ లైఫ్లో వచ్చిన మార్పులేంటని యాంకర్ సుమ అడగ్గా.. ఫోన్కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని, ఎక్కడికెళ్తున్నావనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన సతీమణి లావణ్య త్రిపాఠి కి బహుమతి ఇవ్వలేదన్నారు. విహార యాత్రకు వెళ్లామన్నారు. సినిమా స్క్రిప్టుల ఎంపికలో తన పెద్దనాన్న, నటుడు చిరంజీవి స్ఫూర్తినిస్తారని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన బాబాయ్, నటుడు పవన్ కల్యాణ్లోని నిజాయతీ, ఇతరులకు మంచి చేయాలనే తత్వం తనకు నచ్చుతుందన్నారు.సినిమా గురించి మాట్లాడుతూ.. ''దేశాన్ని రక్షించేవారి గురించి చెప్పడం, వాస్తవ పరిస్థితులను చూపించే అవకాశం అరుదుగా వస్తుంటుంది. ఈ సినిమా అంగీకరించకముందు.. పుల్వామా ఎటాక్ గురించి నాకు కొంత అవగాహన ఉంది. కథ విన్నాక పూర్తిస్థాయిలో తెలుసుకోగలిగా. యువతకు ఇలాంటి చిత్రాలు అవసరమనిపించింది. ఇందులో భాగమవడం నా అదృష్టం. సీరియస్ మోడ్లోనే కాకుండా 'ఆపరేషన్ వాలెంటైన్'ను వినోదాత్మకంగానే తెరకెక్కించాం. 'సాయుధ బలగాల నేపథ్యంలో ఎంతమంది సినిమాలు చేస్తారు?' అని ఇటీవల కొందరు చర్చిస్తుంటే.. ప్రేమకథా చిత్రాలు, కమర్షియల్ సినిమాలు ఎన్నైనా తీస్తున్నప్పుడు రియల్ హీరోపై ఎందుకు తీయకూడదని అడిగా. ఈ సినిమా నాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఇందులోని ఓ పాటను అటారీ- వాఘా బోర్డర్లో విడుదల చేయడం, బీఎస్ఎఫ్ జవాన్లను కలుసుకోవడం మంచి అనుభూతి'' అని చెప్పారు