బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న అక్షయ్ కుమార్ కి ఓ మై గాడ్ టు సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా హిట్ అయిన ఊపులో ప్రస్తుతం వరుస సినిమాలు కమిట్ అవుతున్నాడు.
'ఓ మై గాడ్ 2' తర్వాత తాజాగా 'మిషన్ రాణిగంజ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా, తాజాగా మరో కొత్త ప్రాజెక్టుని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన సందర్భంగా(అక్టోబర్ 2) తన కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించాడు.
'స్కై ఫోర్స్'(Sky Force) అనే దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. 1965లో ఇండియా - పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ఈ సినిమా రానుండగా.. ఈ వీడియోలో సినిమా లోగో తో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇండియా - పాకిస్తాన్ వార్ సమయంలో మాట్లాడిన ప్రసంగం వినిపిస్తుంది. ఆ సమయంలో జరిగిన ఇండియా - పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ఓ స్పెషల్ సీక్రెట్ మిషన్ కు సంబంధించి ఈ సినిమా ఉంటుందని వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కంప్లీట్ యాక్షన్ రోల్లో కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 2024 లో విడుదల చేస్తున్నట్లు వీడియోలో తెలిపారు. వీర్ పహారియా ఈ సినిమాలో కీలక పాత్రతో తెరంగేట్రం చేస్తున్నారు. సినిమాలో అక్షయ్ కుమార్ సరసన సారా అలీ ఖాన్, నిమ్రుత్ కౌర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సందీప్ కేల్వాని, అభిషేకపూర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ సంస్థలపై దినేష్ విజన్, జ్యోతి దేశ్ పాండే, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలను మేకర్స్ అధికారికంగా తెలియజేయనున్నారు.