కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 2018. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభంజనం సృష్టించింది. చిన్న సినిమాగా వచ్చి భారీ వసూళ్లు సాధించి కేరళలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే తాజాగా ఈ సినిమా భారత్ తరఫున ప్రతిష్టాత్మక ఆస్కార్ రేసులో నిలిచింది.ఈ విషయాన్ని స్వయంగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మలయాళంలో తెరకెక్కించిన ఈ సినిమాని అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేశారు.ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్తోనే భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, జాయ్ మాథ్యూ, సుధీష్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు.2024 ఆస్కార్ అకాడమీ అవార్డులకు భారతదేశం అధికారిక ఎంట్రీ సినిమాగా ఈ సినిమాని ఎంపిక చేసినట్లు కన్నడ చిత్ర దర్శకుడు గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని జ్యూరీ ప్రకటించింది.
నామినేషన్ లిస్ట్లో చోటు దక్కించుకుంటేనే ఈ సినిమా అవార్డుకు అర్హత సాధిస్తుంది.ఇక 96వ ఆస్కార్ వేడుకలు మార్చి 10, 2024న లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో జరగనున్నాయి.ఆస్కార్-2023 ఏడాదిలో ఎంట్రీకి ఛెలో షో (2022), కూజాంగల్ (2021), జల్లికట్టు (2020), గల్లీ బాయ్ (2019), విలేజ్ రాక్స్టార్స్ (2018), న్యూటన్ (2017) ఇంకా విసరాని (2016) చిత్రాలు ఎంపిక కాగా.. ఏది కూడా విన్ అవ్వలేదు. ఇప్పటి దాకా మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్ సినిమాలు మాత్రమే ఆస్కార్కు నామినేట్ అయిన భారతీయ సినిమాలుగా నిలిచాయి.ఆస్కార్ 2023లో ఇండియన్ సినిమాలు రెండు అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ రాగా.. డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. కార్తికీ గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో దక్కించుకుంది.