లెజెండరీ యాక్టర్ శరత్బాబు గారి మరణవార్త సినిమా ఇండస్ట్రీని విషాదంలో నింపింది. శరత్ బాబు పూర్తి పేరు సత్యంబాబు దీక్షితులు. ఈయన 1951 జులై 31న ఆమదాలవలసలో జన్మించారు. 1973 వ సంవత్సరంలో రామరాజ్యంతో సినీ రంగ ప్రవేశం చేశారు శరత్బాబు గారు.తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇంకా హిందీ భాషల్లో దాదాపు 250కి పైగా సినిమాలు చేశారు.ఇక పవన్ కల్యాణ్ నటించిన వకీల్సాబ్ సినిమాలో చివరి సారి స్క్రీన్ మీద కనిపించారు. మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, తాయారమ్మా బంగారయ్యా, మూడు ముళ్ల బంధం, సీతాకోక చిలుక, స్వాతిముత్యం, జీవనజ్యోతి,అభినందన, స్వాతిచినుకులు, ఆపద్బాంధవుడు, నువ్వు లేక నేను లేను,శంకర్దాదా జిందాబాద్, శ్రీరామదాసు, ఆట, శౌర్యం, సాగరసంగమం,షిరిడిసాయి, ఎంత మంచివాడవురా, వకీల్ సాబ్ సినిమాల్లో ఆయన చేసిన పాత్రలకు చాలా మంచి గుర్తింపు దక్కింది.ఒక సోదరుడిగా, మధ్యతరగతి మనిషిగా, ప్రలోభాలకు గురైన వ్యక్తిగా, హీరోకి స్నేహితుడిగా, ప్రతినాయకుడిగా ఇంకా సిట్చువేషన్స్ కి తగ్గట్టు ప్రవర్తించే వ్యక్తిగా ఎన్నో రకాల పాత్రల్లో మెప్పించి సినీ పరిశ్రమకి ఆల్ రౌండర్ అనిపించుకున్నారు శరత్బాబు.
బాలచందర్, కె.విశ్వనాథ్, రజనీకాంత్, చిరంజీవి సినిమాల్లో శరత్బాబు పాత్రలను జనాలు అంత తేలిగ్గా మార్చిపోలేరు. కేవలం సోషల్ సినిమాలు మాత్రమే కాదు పౌరాణిక, జానపద ఇంకా భక్తి సినిమాల్లో కూడా మెప్పించారు శరత్బాబు. గంభీరమైన స్వరంతో ఆయన చెప్పే డైలాగులకు చాలా ప్రత్యేకమైన అభిమానులున్నారు. తెలుగు, తమిళంలో ఆయన డైలాగులు చెప్పే తీరు తనకు చాలా ఇష్టమని లెజెండరి డైరెక్టర్ కె.విశ్వనాథ్ గారు పలు సందర్భాల్లో చెప్పారు.ఇక తెలుగులో సీతాకోక చిలుక, ఓ భార్య కథ, నీరాజనం సినిమాల్లో నటించి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చాలా నంది అవార్డులు అందుకున్నారు.తమిళనాడు ఇంకా కేరళ స్టేట్ అవార్డులు కూడా అందుకున్న ఘనత కూడా ఆయనది. సిల్వర్స్క్రీన్ మీద వెలుగుతూ టీవీల్లో నటించిన నటుల్లో శరత్బాబుది చాలా ప్రత్యేకమైన స్థానం. తమిళ దూరదర్శన్లో వచ్చే పలు ధారావాహికల్లో కూడా నటించారు. తెలుగులో కూడా పలు సీరియళ్లలో నటించారు.