
బాల నటి నుండి బాహుబలి వరకు...ఆ "నటి" జీవితం...!
మాది అనకాపల్లి.. నేను ఇక్కడే పుట్టాను. అయితే ఎలా వరకు ఇక్కడే పెరిగాను.... అప్పుడు నా జీవితంలో అనుకోని దుర్ఘటన చోటు చేసుకుంది. నా ఐదేళ్ల వయసులోనే మా అమ్మ మరణించారు. సినిమాల పై మక్కువతో మా నాన్న చెన్నైకి తీసుకువెళ్లారు. అక్కడే పెరిగాను. విజయరామరాజుపేటలో నాన్నగారికి ఇల్లు ఉంది. ఈ మధ్యనే మా నాన్న కాలం చెల్లించారు. అందుకు సంబంధించిన కార్యక్రమం జరపడానికి అనకాపల్లికి వచ్చాను. ఇక్కడ తిరిగి బంధువులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. తెలుగు సినీ పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. చేసిన ప్రతి పాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. తమిళంలో దర్శకురాలిగా పనిచేయడం..తమిళనాడు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందడం నిజంగా గర్వకారణం. చిన్నప్పుడే తల్లి దూరం అవడంతో ఆ ప్రేమను చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు భర్త రఘువరన్ కూడా నన్ను వదిలి వెళ్లిపోవడం నన్ను కుంగిపోయేలా చేసింది.
అటువంటి సమయంలో నా బంధుమిత్రులు, నా సినీ స్నేహితులు ఎంతో ధైర్యం చెప్పి ముందుండి నడిపించారు. చిన్నప్పుడు చదువుకోవాలని ఎంతో కోరికగా ఉండేది... కానీ 12 ఏళ్ల వరకు అక్షరాలు దిద్దే అవకాశం రాలేదు. ఆ తర్వాత నా చదువు ప్రారంభమైంది. నాకు ముగ్గురు అన్నయ్యలు, ఒక తమ్ముడు. నా సినీ జీవితం యశోదకృష్ణ సినిమాలో చిన్నికృష్ణుని పాత్ర తో మొదలైంది. మొట్టమొదటిసారిగా ఓ మలయాళ చిత్రంలో హీరోయిన్ గా చేశాను ఆ సినిమాలో రఘువరన్ హీరోగా నటించారు. అప్పుడే ఆయన పై ప్రేమ చిగురించింది... కానీ నా వయసు చాలా తక్కువ కేవలం15 ఏళ్ళు కావడంతో మనసులోని భావాలను బయట పెట్టలేకపోయాను.
ఆ తర్వాత పదేళ్లకు మళ్లీ రఘువరన్ ను చూశాను. ఆ తర్వాత మా ప్రేమ పెళ్లి గా మారింది. బాబు పుట్టిన తర్వాత మనసులు కలవక ఇష్టపూర్వకంగానే విడిపోయాం. రఘువరన్ చిన్నవయసులోనే చనిపోవడం నాకెంతో బాధని మిగిల్చింది. అయినా ఎన్నో సమస్యలను ఎదుర్కొని సినీ జీవితాన్ని కంటిన్యూ చేశాను.అన్ని పాత్రలూ నాకు డ్రీమ్రోల్సే. 300లకుపైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుని ప్రేక్షకుల అభిమానం పొందిన నేను ఎంతో అదృష్టవంతురాలిగా భావిస్తా. నా జీవిత కాలం సినీరంగంలోనే కొనసాగాలని కోరుకుంటున్నాను. నా కొడుకే నా సర్వస్వం అంటూ చెప్పుకొచ్చారు నటి రోహిణి.