ఝాన్సీ 'పెద్దలకు మాత్రమే'..

Deekshitha Reddy
సీనియర్ యాంకర్ ఝాన్సీ ఓటీటీ వేదిక కోసం కొత్త ప్రాజెక్ట్ సిద్ధం చేస్తోంది. దీని పేరు 'పెద్దలకు మాత్రమే'. అయితే టైటిల్ చూసి మోసపోవద్దని, దీంట్లో అడల్ట్ కంటెంట్ ఏమీ ఉండదని చెబుతున్నారామె. మనం పెరిగి పెద్దయ్యే క్రమంలో కొన్ని విషయాలను నేర్చుకోకుండా ఉండిపోతున్నామని, అలాంటి వాటిని తిరిగి వారికి నేర్పించే క్రమంలో, ఆయా విషయాలను చర్చించడం కోసం కొత్త ప్రాజెక్ట్ చేపట్టినట్టు తెలిపారు ఝాన్సీ. వాస్తవానికి యాంకర్ గా ఝాన్సీకి ఇప్పుడు ఫుల్ కాంపిటీషన్ నడుస్తోంది. కొత్త తరం దూసుకొస్తోంది. ఇలాంటి టైమ్ లో రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కార్యక్రమాలు కాకుండా కాస్త ప్రజల్లో ఆలోచన రేకెత్తించే ప్రోగ్రామ్స్ కోసం ఝాన్సీ ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రయత్నమే 'పెద్దలకు మాత్రమే'.
ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ల కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు కొన్ని న్యూస్ ఛానెళ్లకోసం ప్రత్యేక చర్చలు, ఎన్నికల సమయంలో టాక్ షోలు నడిపించారు ఝాన్సీ. ఆ అనుభవంతోటే ఆమె పలు సందర్భాల్లో ప్రజా సమస్యలపై స్పందిస్తుంటారు. తాజాగా లాక్ డౌన్ టైమ్ లో సినిమా, సీరియళ్ల షూటింగ్ లకు అనుకోకుండా బ్రేక్ పడింది. టీవీ కార్యక్రమాలు కూడా అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. ఓటీటీ పూర్తిగా డామినేట్ చేసే పరిస్థితి. ఈ దశలో ఓటీటీలకోసం ఝాన్సీ ఈ కొత్త ప్రాజెక్ట్ తలపెట్టినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఓటీటీలలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రేక్షకుల్ని తమవైపు ఆకర్షించాలంటే, సబ్ స్క్రిప్షన్స్ పెంచుకోవాలంటే ముందు అడల్ట్ కంటెంట్ తోనే ఎరవేయాలని చూస్తున్నారు నిర్వాహకులు. అదే దారిలో 'పెద్దలకు మాత్రమే' అనే టైటిల్ తో ఝాన్సీ తెరపైకి రాబోతున్నారు. అయితే టైటిల్ చూసి ఎవరూ మోసపోవద్దని, ఇది పెద్దలు మాత్రమే చూసే కార్యక్రమం కాదని, పెద్దలతోపాటు అందరూ ఈ ప్రోగ్రామ్ చూడొచ్చని, అదే సమయంలో పెద్దలకు ఉపయోగపడేలా, మిగతా జీవితాన్ని సరిదిద్దుకునేలా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు ఝాన్సీ. అలీ టాక్ షోలో ఝాన్సీ ఈ విశేషాలన్నీ వివరించారు. ఝాన్సీ 'పెద్దలకు మాత్రమే' ఎలా ఉంటుందనే విషయం తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: