కొరటాల సినిమాలో మెగాస్టార్ ఒక్కరిగానే !
కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోబోతుందట. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుంది. అయితే మెగాస్టార్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 'స్క్రిప్టు ఫైనల్ వెర్షన్ జరుగుతోంది. టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ చిత్రంలో నేను ద్విపాత్రాభినయం చేస్తున్నానని వార్తలొచ్చాయి. అందులో నిజం లేదు' అని చిరు తెలిపారు. వచ్చే వారంలో ఈ సినిమాలో చిరు లుక్ కి సంబంధించి లుక్ టెస్ట్ జరగనుందట. ఈ లుక్ టెస్ట్ ను బట్టే సినిమాలో మెగాస్టార్ గెటప్ ను డిసైడ్ చెయ్యాలని కొరటాల ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం గతకొంతకాలంగా కొరటాల పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను లేదా అనుష్క శెట్టిని ఇద్దరిలో ఒకరిని హీరోయిన్ గా తీసుకోనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ రెండవ వారంలో ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయాలని ఇప్పటికే మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చిరు కోసం కొరటాల ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేశారట. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో మొదలు కానుందని.. పలాస ప్రాంతంలో వరుసగా ఇరవై రోజులు పాటు షూట్ చేయనున్నారని తెలుస్తోంది. సినిమాలో కొన్ని సన్నివేవాలు పల్లెటూరి నేపథ్యంలో ఉంటాయట. మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను రాయడంలో కొరటాలకి మంచి పట్టు ఉంది. ఈ చిత్రంలో సునీల్, అనసూయ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తునట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రూమర్స్ కూడా వచ్చాయి. మరి వాటిల్లో ఎంత నిజం ఉందో సినిమా స్టార్ట్ అయితే గాని తెలియదు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ' సైరా నర్సింహారెడ్డి' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.