తెలుగు బుల్లితెరపై వస్తున్న ‘జబర్దస్త్’ గురించి అందరికీ తెలిసిందే. గురువారం వస్తే చాలు రాత్రి అందరూ ఈ నవ్వుల కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరికి నచ్చిన కార్యక్రమం జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్. ఈ కార్యక్రమంతో యాంకర్లు అనసూయ, రష్మిలకు మంచి క్రేజ్ లభించింది. వారు ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇక జడ్జీలుగా నాగబాబు, నటి రోజాలు వ్యవహరిస్తున్నారు. జబర్ధస్త్ తో మంచి ఫామ్ లోకి వచ్చిన వేణు, ధన్ రాజ్, షకల్ శంకర్ ఇలా కొంత మంది సినిమాల్లో కమెడియన్లు గా రాణిస్తున్నారు. వారంలో రెండుసార్లు ప్రేక్షకులకు నవ్వులు పూయించే ఈ షో తెలుగు ప్రజల ఆదరాభిమానులు పొందుతోంది.
అయితే, ఈ షోలో అమ్మాయిల గెటప్లో కనిపించిన అబ్బాయిలను చూస్తే.. వారు నిజంగానే అమ్మాయిలా అని ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా సాయి తేజ..ఒకరంగా అమ్మాయిలే ఈర్ష్యపడేలా ఉంటాడు. అయితే, గత కొద్ది నెలలుగా సాయితేజ ‘జబర్దస్త్’ షోలో కనిపించడం లేదు. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్లో ప్రత్యక్షమైన సాయితేజ.. కొన్ని షాకింగ్ నిజాలను ప్రేక్షకులకు వెల్లడించాడు. కాకపోతే ఈ విషయం ఇప్పటి వరకు తన తల్లిదండ్రులకు కూడా తెలియదని..దగ్గరి వారికి కూడా తెలియదని అన్నాడు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలు ఇంటర్వ్యూలో తెలిపాడు.
లేడీ గెటప్లో ఉంటే డబ్బులు వస్తాయని నేను పూర్తిగా అమ్మాయిలా మారిపోయాను అనుకోవడం పొరపాటు. అబ్బాయిగా ఉండి కూడా లేడీ గెటప్లు వేస్తూ సంపాదించవచ్చు. కానీ, నాకు చిన్నప్పటి నుంచే నాలో అమ్మాయిల లక్షణాలు ఉండేవి. ఐదేళ్ల వయస్సులో నా అక్క దుస్తులు వేసుకునేవాడిని, అద్దం ముందుకు వెళ్లి మేకప్ వేసుకునేవాడిని..కాకపోతే ఈ విషయం బయటకు తెలిస్తే తల్లిదండ్రుల పరువు పోతుందని..కానీ అమ్మాయిల లక్షణాలు అప్పట్లోనే నాకు బాగా ఉండేవని మదనపడేవాడినని అన్నాడు.
జబర్దస్త్లో అమ్మాయిగా గెటప్ వేస్తున్నప్పుడు చాలా సంతోషం కలిగేది. అమ్మాయిలా మారినా ఏదో బాధ లోపల ఉంది. ధైర్యంగా బయటకు వెళ్లలేకపోతున్నా. ఈ నాలుగు నెలల్లో చావు దగ్గరగా వెళ్లి.. బతికి బయటపడ్డాను. జెండర్ చేంజ్ సర్జరీ తర్వాత నాకు అర్థరైటిస్ వచ్చింది. పెద్ద హాస్పిటల్లకు వేలకు వేలు ఖర్చుపెట్టా. ఆ క్షణంలో నా స్నేహితులు నన్ను రక్షించారు. బెడ్ మీద నుంచి కూడా లేవలేని పరిస్థితిలో ఉన్న నాకు ఎంతో సాయం చేశారు. అందుకే.. నేను ఇన్ని రోజులు ‘జబర్దస్త్’ షోలో కనిపించలేదు.