భరత్ అనే నేను’ సినిమా సక్సెస్ కావటంతో, సినిమా ప్రమోషన్ లో భాగంగా, మహేష్ బాబు ఈ రోజు విజయవాడలో పర్యటించారు.. ప్రేక్షకులతో కలసి సినిమాను చూసేందుకు ప్రత్యేక విమానంలో, హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. దర్శకుడు కొరటాల శివ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి ఆయన విజయవాడ వచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకొని, అమ్మవారిని దర్శించుకున్నారు.. ఆలయానికి చేరుకున్న మహేష్, దర్శకుడు, ఇతరులకు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్ధప్రసాదాలను అందజేశారు. కొరటాల శివ, మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన 'భరత్ అనే నేను' సినిమాకి మంచి స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. విజయవాడ రావడం ఆనందంగా ఉందని మహేశ్ బాబు అన్నారు. తాను విజయవాడ రావడం సెంటిమెంట్గా భావిస్తానని, గతంలో ఒక్కడు, పోకిరీ, దూకుడు వంటి విజయోత్సవ సభలను కూడా విజయవాడలోనే నిర్వహించామని అన్నారు. తన తాజా చిత్రం 'భరత్ అనే నేను' చిత్రానికి ఘన విజయం అందించిన అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నట్లు పేర్కొన్నారు.
అక్కడ నుంచి, బెంజిసర్కిల్ ట్రెండ్ సెట్ మాల్ లో ప్రేక్షకులతో కలిసి ‘భరత్ అనే నేను’ సినిమాను చుసారు. తరువాత, డీవీ మానర్ హోటల్లో మహేశ్బాబు గుండె శస్త్ర చికిత్స చేసుకున్న చిన్నారులను కలిశారు. ఆంధ్రా హాస్పిటల్స్ మరియి ఇంగ్లండ్కు చెందిన లిటిల్ హెవెన్స్ ఆధ్వర్యంలో, ఇప్పటి వరకు 300 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేశారు. గుండె చికిత్స చేయించుకున్న చిన్నారులతో కలిసి మహేష్ కాసేపు సరదాగా గడిపారు.
రెండేళ్లుగా చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్లకు మహేష్బాబు సహకారం అందిస్తున్నారని, అలాగే బుర్రిపాలెం గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించామని, వైద్యులు తెలిపారు. రాజకీయ అరంగేట్రం గురించి ప్రస్తావించగా, తనకు వందేళ్లు వచ్చే వరకూ సినిమాల్లోనే నటిస్తానని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రానని వెల్లడించారు.
జీవితాంతం సినిమాలు చేస్తానని, ఇతర విషయాల జోలికి వెళ్లనని మహేష్బాబు ఘంటాపథంగా చెప్పారు. మహేశ్ బాబును చూడటానికి అభిమానులు భారీగా చేరుకున్నారు.