వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేదిక ఫిక్స్.. ట్రైలర్ ఎప్పుడంటే..?

Divya
చిరంజీవితో గతంలో అన్నయ్య సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ బాబి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ వాల్తేరు వీరయ్య సినిమాతో జతకట్టాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి - శృతిహాసన్ కాంబినేషన్లో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్, పోస్టర్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు వైజాగ్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాలవల్ల విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో చేయాలనుకున్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

ఇందుకు ప్రత్యామ్నాయంగా మరో వేదికను ఎంచుకోవాలని నిర్వాహకులకు పోలీసులు సూచించగా ఈ ఈవెంట్ వేదికను విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాదు హైదరాబాదు నుంచి అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక రైలును కూడా బుక్ చేశారు.ఇటీవల ఏపీ ప్రభుత్వం రోడ్లలో,  ప్రధాన కూడళ్లలో సభలు,  ర్యాలీలు నిర్వహించకుండా జీవో నెంబర్ వన్ జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు పోలీసులు అనుమతించలేదు.  కానీ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ను ఎంపిక చేయడం అక్కడ నిర్వహణకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వడంతో చిత్ర నిర్మాతలు ఏర్పాట్లలో నిమగ్నం అయిపోయారు.
ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా హాజరు కాబోతుండడంతో పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమా నుంచి ట్రైలర్ విడుదలయ్యింది. మరి వాల్తేరు వీరయ్య ట్రైలర్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: