బంద్ విషయంలో హీరోలు ఫైర్.. తగ్గిన నిర్మాతలు?

Purushottham Vinay
ఇక నిన్న మొన్నటివరకు కూడా బాగా 'బంద్‌' జపం చేసిన టాలీవుడ్‌ నిర్మాతలు ఇప్పుడు మాట మార్చారా?ఎందుకంటే వారి మాటలు వింటుంటే అదే అనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు కూడా బంద్‌ బంద్‌ అంటూ గట్టిగా ఉన్న యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఇప్పుడు ఇది బంద్‌ కాని బంద్‌. ఇదో విరామం లాంటిది అంటున్నారట.సాధారణంగా సినిమా పరిశ్రమలో బంద్‌లు అంటే కార్మికులు చేస్తూ ఉంటారు. లేదంటే థియేటర్ల వాళ్లు ఇంకా ప్రదర్శనకారులు చేస్తుంటారు. కానీ ఈసారి నిర్మాతలే ముందుకొచ్చి మేం సినిమాలు చేయం అని ఆపేశారు. అలా అని అందరూ ఆపేశారా? అంటే లొసుగులు మాట్లాడుతూ కొన్ని సినిమాల షూటింగ్‌లు అయితే అవుతున్నాయి. దీంతో నిర్మాతల మధ్య యూనిటీ కూడా దెబ్బతింది అని అంటున్నారు. అలాగే మరోవైపు హీరోలు కూడా సినిమా షూటింగ్‌లు స్టార్ట్‌ చేయాల్సిందే అంటున్నారట. డేట్స్‌ సమస్యలు కూడా వస్తాయనేది వారి ఉద్దేశం.దసరా, ఇయర్‌ ఎండ్‌ ఇంకా సంక్రాంతి అంటూ కొన్ని సినిమాలు ముందుగానే డేట్లు అనుకున్నాయి. ఇక వాటి షూటింగే ఇప్పుడు ఆగిపోయింది. ఆ సీజన్లు మిస్‌ అవ్వకూడదంటే వెంటనే షూటింగ్‌లు అనేవి స్టార్ట్‌ అవ్వాలి. ఆ తర్వాత అనుకున్న సినిమాలు వెంటనే స్టార్ట్‌ చేయాలి. అందుకే మన హీరోలు 'వెంటనే స్టార్ట్‌ చేయండి' అంటున్నారట.


ఇంకా మరోవైపు దర్శకుల పరిస్థితి కూడా ఇదే. సినిమాని స్టార్ట్‌ చేయకుండా ఉన్న వాళ్లు మాత్రం కామ్‌గా ఉన్నారట.ఇక నిర్మాతల నిర్ణయం పట్ల హీరో నాని గుర్రుగా ఉన్నాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. తన 'దసరా' సినిమా కొత్త షెడ్యూల్‌ వెంటనే మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. సోమవారం నాటి నుండే చిత్రీకరణ ఉంటుందని చెప్పారు. అలాగే మరోవైపు బాలకృష్ణ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారట. గోపీచంద్‌ మలినేని సినిమా కొత్త షెడ్యూల్‌ వీలైనంత త్వరగా స్టార్ట్‌ చేయాలని ఆయన అంటున్నారు. ఈ సినిమా పూర్తి చేసి ఆయన అనిల్‌ రావిపూడి సినిమా కూడా షురూ చేయాల్సి ఉంది.దీంతో ఇక నిర్మాతలు కూడా ఆలోచనలో పడ్డారని అంటున్నారు. బంద్‌ కాదు ఇది విరామం అంటూ ఆలోచన మార్చింది కూడా ఇందుకే అని చెబుతున్నారు. విరామం అంటే ఎప్పుడైనా ఇంకా ఎవరైనా తమ పని స్టార్ట్‌ చేయొచ్చు. హీరోల ఒత్తిడి కారణంగానే బంద్‌ కాస్త ఇప్పుడు విరామంగా మారింది అని చెప్పుకోవచ్చు.ఇక ఆదివారం సాయంత్రానికి ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: