మరొకసారి రియల్ హీరో అని నిరూపించుకున్న సూర్య !

Seetha Sailaja
తమిళ స్టార్ హీరో సూర్య తన సినిమాల రికార్డుల గురించి కాకుండా తాను ఎన్ని మంచి పనులు చేసాను అని నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పటికే సూర్య తమిళనాడు లోని అనేకమంది అనాధ పిల్లలను దత్తత తీసుకోవడమే కాకుండా వారు మంచి విద్యావంతులుగా మారి జీవితంలో  సెటిల్ అయ్యేవరకు అనేక సహాయాలు చేస్తున్నాడు.

సూర్య భార్య జ్యోతిక కూడ సూర్య చేసే స్వచ్చంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ సూర్య ఇమేజ్ ని మరింత పెంచుతోంది. కరోనా వేవ్ సమయంలో సూర్య నటించిన సినిమాలు అన్నీ విజయవంతం అయి అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే అతడు లేటెస్ట్ గా నటించిన ‘ఈటీ’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో సూర్య కమర్షియల్ సినిమాలకు పనికి రాడా అన్న చర్చలు జరుగుతున్నాయి.

ఈ పరిస్థితుల మధ్య సూర్య మరొక సినిమాకు లైన్ క్లియర్ చేసాడు. ఈమూవీలో సూర్య మత్స్యకారుడు గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కన్యాకుమారి సముద్ర తీరప్రాంతంలో జరుగుతోంది.
ఈమూవీ కోసం సముద్ర తీర ప్రాంతంలో భారీ ఖర్చుతో సెట్స్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందులో భాగంగా మత్స్యకారులు నివసించే ఇల్లు  గుడిసెలను నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ తరువాత ఈ నిర్మాణాలను కూల్చేయకుండా ఇళ్లు లేని జాలర్లకు ఉచితంగా ఇవ్వాలని సూర్య నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇలా మత్స్య కారులకు శాస్వితంగా ఇళ్ళు ఇచ్చే వ్యవహారం ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆ ఇళ్ళకు అయ్యే నిర్మాణ ఖర్చును తన పారితోషికం తగ్గించుకుని అందులో సద్దుబాటు చేసుకోమని సూర్య చెప్పినట్లు వచ్చిన వార్తలు కోలీవుడ్ మీడియాలో హాట్ న్యూస్ గా మారాయి. దీనితో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ సూర్యాను అభినందిస్తు కామెంట్స్ పెడుతున్నారు. సూర్య డైరెక్టర్ బాలా కాంబినేషన్ లో గతంలో ‘నందా’ ‘పితామహన్’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండటంతో ఈసారి సూర్యకు సక్సస్ గ్యారెంటీ అన్నమాటలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: